పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి :
హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ, సీఎస్ఈ విభాగం ప్రొఫెసర్ ప్రీతి అంబరీష్ పర్వేకర్ పలు జాతీయ, అంతర్జాతీయ సదస్సులలో విశిష్ట వక్తగా పాల్గొని, తన నైపుణ్యాలను ఇతరులతో పంచుకుంటున్నట్టు బుధవారం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు. భువనేశ్వర్ ఇంజనీరింగ్ కళాశాల ఈనెల 1-2 తేదీలలో డేటా ఇంజనీరింగ్, కమ్యూనికేషన్ టెక్నాలజీపై నిర్వహించిన అంతర్జాతీయ సదస్సులో ఆమె విశిష్ట వక్తగా పాల్గొన్నట్టు తెలిపారు. అందులో ఆమె ఐవోటీ, సెన్సార్ టెక్నాలజీలపై అంతర్దృష్టితో కూడిన ప్రసంగం చేయడమే గాక, అత్యాధునిక దృక్పథాలు, వాస్తవ ప్రపంచ వినియోగాలను పరిచయం చేసినట్టు పేర్కొన్నారు.
ఇది ఆయా ప్రతినిధుల ప్రశంసలను అందుకోవడమే గాక, విశిష్ట అతిథులు కేఐఐటీ రీసెర్చ్ డీన్ ప్రొఫెసర్ గణపతి పాండా, బీసీయూటీ ఉప కులపతి ప్రొఫెసర్ ఎ.రత్, ఎస్ఓఏ విశ్వవిద్యాలయ అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ పి.కె.పాత్ర, ఐఎంఐటీ ప్రిన్సిపల్ సైంటిస్ట్ దేబీప్రసాద్ దాస్ వంటి ప్రముఖులు ఆమెను సత్కరించినట్టు తెలియజేశారు.దీనికి ముందు, ఇండోర్ లోని శ్రీ వైష్ణవి విద్యాపీఠ్ విశ్వవిద్యాలయ సహకారంతో భారతీయ విశ్వవిద్యాలయాల సంఘం (ఏఐయూ)లోని విద్యా, పరిపాలనాభివృద్ధి కేంద్రం (ఏఏడీసీ) నిర్వహించిన అధ్యాపక వికాస కార్యక్రమం (ఎఫ్ డీపీ)లో కూడా ప్రొఫెసర్ పర్వేకర్ విశిష్ట వక్తగా పాల్గొన్నట్టు తెలిపారు.
పరిశోధనను సాధికారపరచడం: ప్రభావవంతమైన పరిశోధన అభివృద్ధికి సాధనాలు, సాంకేతికలు అనే ఇతివృత్తంతో ఈ ఎఫ్ డీపీ సాగిందన్నారు. పరిశోధన నీతి, కాపీరైట్ సాధనాలు, ఉత్తమ పద్ధతులపై ప్రభావవంతమైన సెషన్ ను పర్వేకర్ నిర్వహించి, విద్యా పరిశోధనలో సమగ్రత, నాణ్యత యొక్క ప్రాముఖ్యతను వివరించినట్టు తెలియజేశారు.విశ్వవిద్యాలయం తరఫున పలు వేదికలలో ప్రొఫెసర్ పర్వేకర్ ప్రాతినిధ్యం వహిస్తున్నందుకు పలువురు గీతం ఉన్నతాధికారులు హర్షం వెలిబుచ్చారు.
