ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్, పాలిటెక్నిక్ కళాశాలలకు త్వరితగతిన భూమి కేటాయింపులు చేయండి
పాశమైలారం పరిధిలో కుంటలను కబ్జాల నుండి కాపాడండి
జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
పటాన్చెరు మండల పరిధిలోని భానూరు, నందిగామ, క్యాసారం గ్రామపంచాయతీలను సమగ్ర అభివృద్ధి కోసం ఇస్నాపూర్ మున్సిపాలిటీలో విలీనం చేయాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావిణ్యను పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.మంగళవారం సాయంత్రం సంగారెడ్డి లోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ తో ఎమ్మెల్యే జిఎంఆర్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా వివిధ అంశాలపై కలెక్టర్ తో చర్చించారు. ప్రధానంగా ప్రభుత్వం ఇటీవల పటాన్చెరు నియోజకవర్గం పరిధిలో ఇంద్రేశం, జిన్నారం కేంద్రాలుగా నూతన మున్సిపాలిటీలను ఏర్పాటు చేయడంతో పాటు వీటి పరిధిలోని గ్రామాలను డీ నోటిఫికేషన్ చేస్తూ గెజిట్ విడుదల చేసిందని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో పటాన్చెరు మండల పరిషత్ పరిధిలోని మొత్తం 19 గ్రామపంచాయతీలలో భానూరు, నందిగామ, క్యాసారం గ్రామాలు మాత్రమే మండల పరిధిలో మిగిలిపోయాయని తెలిపారు. మిగిలిన గ్రామాలు ఇస్నాపూర్, ఇంద్రేశం మున్సిపాలిటీల పరిధిలోకి వెళ్ళాయని పేర్కొన్నారు. పైన పేర్కొన్న మూడు గ్రామాలు మరింత అభివృద్ధి, మెరుగైన పరిపాలన సౌలభ్యం కోసం ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలో విలీనం చేయాలని కోరారు.
ఇందుకు సంబంధించిన ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని కోరారు. గతంలో కోరిన విధంగా నియోజకవర్గానికి నూతనంగా మంజూరైన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల భవనాల నిర్మాణం కోసం పటాన్చెరు రెవెన్యూ పరిధిలోని పోచారం గ్రామ పరిధిలో గల సర్వే నంబర్ 69లో త్వరితగతిన భూమి కేటాయింపులు చేయాలని మరోమారు విజ్ఞప్తి చేశారు. ఈ విద్యా సంవత్సరం నుండి పాలిటెక్నిక్ కళాశాలకు సంబంధించిన తరగతులు పటాన్చెరువు పట్టణంలోని డిగ్రీ కళాశాల భవనంలో ప్రారంభమయ్యాయని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. వచ్చే విద్యా సంవత్సరం లోపు భవన నిర్మాణాలు పూర్తయితే విద్యార్థులకు సౌకర్యవంతంగా ఉంటుందని తెలిపారు. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కోసం ప్రభుత్వం ఇప్పటికే 200 కోట్ల రూపాయలు నిధులు కేటాయించడంతో భూమి కేటాయించిన వెంటనే పనులు ప్రారంభించవచ్చని పేర్కొన్నారు.
ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని పాశమైలారం గ్రామ పరిధిలో గల కొత్త కుంట, పాపాయిగూడ కుంట, గొల్లవానికుంట, ఉబ్బాని కుంట, వడ్లవానికుంట, ఆరోటోని కుంటల పరిధిలోని 39 ఎకరాల ఆరు గంటల భూమి పూర్తిగా ఆక్రములకు గురైందని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. కుంటలు ఆక్రమణలకు గురి కావడం మూలంగా వీటిపై ఆధారపడి జీవిస్తున్న మత్స్యకార కుటుంబాలు స్థానిక పరిశ్రమలలో కూలీలుగా పనిచేస్తూ కుటుంబాలను పోషించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ఆరు కుంటల పరిధిలో ఆక్రమణలు తొలగించి చేపల పెంపకానికి అనువుగా తీర్చిదిద్దాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇదే అంశంపై ఇప్పటికే హైడ్రా కమిషనర్ తో పాటు, నీటిపారుదల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ అధికారులకు సైతం విన్నవించడం జరిగిందని తెలిపారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన జిల్లా కలెక్టర్ ప్రావిణ్య త్వరలోనే భూమి కేటాయింపులపై నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. పాశమైలారం గ్రామ పరిధిలో కుంటల అక్రమలపై వెంటనే విచారణ చేపడతామని తెలిపారు.