పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ సైన్స్, గణిత శాస్త్ర విభాగం పరిశోధక విద్యార్థిని హారిక బూర్గుల డాక్టరేట్ కు అర్హత సాధించారు. హైబ్రిడ్ నియర్ ఆల్జీబ్రా, న్యూట్రోసోఫిక్ నియర్ ఆల్జీబ్రాలోని కొన్ని అంశాలపై ఆమె అధ్యయనం చేసి, సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించారు.ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ గణిత శాస్త్ర విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ పి.నరసింహ స్వామి మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు.డాక్టర్ హారిక చేసిన అత్యుత్తమ పరిశోధన ఈ రంగానికి విలువైన అంతర్దృష్టులను జోడిస్తుందని, గణిత శాస్త్రాల పురోగతికి గణనీయంగా దోహదపడుతుందని తెలిపారు. ఆమె సూక్ష్మమైన పని బీజగణిత నిర్మాణాల రంగంలో మరింత అన్వేషణ, అనువర్తనానికి కొత్త మార్గాలను తెరుస్తుందన్నారు.డాక్టర్ హారిక సిద్ధాంత వ్యాసం పీహెచ్.డీ. పట్టాకు అర్హత సాధించడం పట్ల గీతం హైదరాబాదు అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు, గీతం రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, స్కూల్ ఆఫ్ సైన్స్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం.రెజా, పలు విభాగాల అధిపతులు, అధ్యాపకులు, సిబ్బంది తదితరులు అభినందించినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.గీతం విద్యా నైపుణ్యాన్ని పెంపొందించి, మద్దతు ఇవ్వడమే గాక, జ్జానం, ఆవిష్కరణల వృద్ధికి దోహదపడే పరిశోధనలను ప్రోత్సహిస్తోందని తెలియజేశారు.