ఏడు కోట్ల రూపాయల సిఎస్ఆర్ నిధులతో కళాశాలలో అభివృద్ధి పనులు
శాశ్వత ప్రాతిపదికన పాలిటెక్నిక్ కళాశాల శాశ్వత భవనం
ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
పటాన్చెరు నియోజకవర్గ కేంద్రాన్ని ఎడ్యుకేషనల్ హబ్ గా తీర్చిదిద్దడంలో భాగంగా.. పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, డిగ్రీ కళాశాల భవనంలో గ్లాండ్ ఫార్మా పరిశ్రమ సహకారంతో ఏడు కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించిన 15 అదనపు తరగతి గదులు పూర్తయ్యాయని.. అతి త్వరలో వాటిని ప్రారంభించనున్నట్లు స్థానిక శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.
ఇటీవల పటాన్చెరు కు మంజూరైన పాలిటెక్నిక్ కళాశాలకు శాశ్వత ప్రాతిపదికన తోషిబా కంపెనీ సహకారంతో 14 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఆధునిక వసతులతో భవనం నిర్మించేందుకు ప్రతిపాదన సిద్ధం చేశామని ఆయన తెలిపారు. సోమవారం సాయంత్రం పట్టణంలోని జూనియర్ కళాశాల, డిగ్రీ కళాశాల, ప్రాథమిక ఉన్నత పాఠశాల భవనాలను ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోజురోజుకీ పెరుగుతున్న విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా అదనపు తరగతి గదులు నిర్మించాలన్న లక్ష్యంతో గత సంవత్సరం గ్లాండ్ ఫార్మా పరిశ్రమ సహకారంతో ఏడు కోట్ల రూపాయలు కేటాయించడం జరిగిందని తెలిపారు. త్వరలోనే ప్రతి తరగతి గదికి ఫర్నిచర్ అందించనున్నట్లు తెలిపారు. అతి త్వరలో వీటిని ప్రారంభించి.. విద్యార్థులకు అందుబాటులోకి తీసుకొని రానున్నట్లు తెలిపారు.ఇటీవల మంజూరైన పాలిటెక్నిక్ కళాశాల తరగతుల కోసం డిగ్రీ కళాశాల ప్రాంగణంలోని కొన్ని గదులను కేటాయించడం జరిగిందని తెలిపారు.
త్వరలోనే శాశ్వత ప్రాతిపదికన భవనం నిర్మించేందుకు ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. తోషిబా పరిశ్రమ సహకారంతో 14 కోట్ల రూపాయలతో ఆధునిక వసతులతో నిర్మించనున్నట్లు తెలిపారు. ఇప్పటికే భూమిని సైతం కేటాయించడం జరిగిందని తెలిపారు. వీటితోపాటు మండల పరిషత్, జిల్లా పరిషత్ బాలుర పాఠశాలలోనూ కోటి రూపాయలతో అదనపు తరగతి గదులు నిర్మించేందుకు నిర్ణయించినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి నాగేశ్వరరావు నాయక్, జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ మురళీకృష్ణ, డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు
