పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
గడిలపై గళమెత్తి, తెలంగాణ రాష్ట్రంలో భూ పోరాటానికి నాంది పలికి, మహిళా చైతన్యానికి ప్రత్యేకగా నిలిచిన చాకలి ఐలమ్మ జీవితం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. చాకలి ఐలమ్మ జయంతిని పురస్కరించుకొని.. పటాన్చెరు డివిజన్ పరిధిలోని సాకి చెరువు కట్టపై ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలవేసి ఆయన ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ సాయుధ పోరాటంలో కీలక భూమిక పోషించి మహిళా చైతన్యానికి స్ఫూర్తిగా నిలిచిన చాకలి ఐలమ్మ పేరును హైదరాబాదులోని మహిళా విశ్వవిద్యాలయానికి పెడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. వారి వారసులకు సైతం సమచిత గౌరవం కల్పించారని పేర్కొన్నారు. పటాన్చెరు పట్టణంలోని సాకి చెరువు కట్టపై అతి త్వరలో చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పటాన్చెరు మాజీ ఎంపీపీ శ్రీశైలం యాదవ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, సీనియర్ నాయకులు అఫ్జల్, రజక సంఘం అధ్యక్షుడు మహేష్, తదితరులు పాల్గొన్నారు.