– గీతం ఇండస్ట్రియల్ కాంక్లేవ్ -1.0′
– స్కిల్ తోనే ఫ్యూచర్
– గీతం ఇండస్ట్రియల్ కాంక్లేవ్-1.0లో వర్ధమాన ఇంజనీర్లకు వక్తల సూచన
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా యువత సన్నద్ధం కావాలని, అందివస్తున్న ఆధునిక సాంకేతికతపై పట్టు సాధించి ఉత్తమ భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని పరిశ్రమకు చెందిన పలువురు ఉన్నతాధికారులు సూచించారు. గీతం కెరీర్ గైడెన్స్ కేంద్రం (జీసీజీసీ) ఆధ్వర్యంలో ‘గీతం ఇండస్ట్రియల్ కాంక్లేవ్ -1.0’ను శుక్రవారం నిర్వహించారు. ఇందులో పలు పరిశ్రమలు, సాఫ్ట్ వెర్ కంపెనీల ఉన్నతాధికారులు పాల్గొని విద్యార్థుల మెరుగైన భవిష్యత్తు కోసం పలు సూచనలు చేశారు. గీతం విద్యార్థులు ఏర్పాటు చేసిన ప్రాజెక్టు ప్రదర్శనను అతిథులంతా సందర్శించి, అభినందనలు తెలియజేశారు. నీమెట్ స్కెచ్ ఇండియా మేనేజింగ్ డైరక్టర్ విశాల్ మణి, పరిశ్రమ- విద్యా సంస్థల మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించేలా గీతం కాంక్లేవ్ ఏర్పాటు చేయడంపై హర్షం వెలిబుచ్చారు. కెరీర్ రెండు అంశాలపై ఆధారపడి ఉంటుందని, అవి బాహ్య (పరిశ్రమ), సొంత నెపుణ్యాలన్నారు. విజయం మూడు అంశాలపై ఆధారపడి ఉంటుందని అవి నెపుణ్యం, ఎంపిక, కొంచెం అదృష్టంగా అభివర్ణిస్తూ, పరిశ్రమ డిమాండు అనుగుణంగా నెపుణ్యాలను సమకూర్చుకోవాలని వర్ధమాన ఇంజనీర్లకు హితబోధ చేశారు.
ఏటీఎంఈసీఎస్ సీనియర్ ఉపాధ్యక్షుడు (ఇంజనీరింగ్) సంజయ్ సింగ్ మాట్లాడుతూ, 75 నుంచి 78 శాతం వ్యాపారాలు కృత్రిమ మేథ ద్వారా ఉద్యోగులను తగ్గించుకునే ప్రయత్నంలో ఉన్నాయని, 2030 నాటికి మూడు కోట్ల ఉద్యోగాలు పోతాయని హెచ్చరించారు. రాబోయే ఐదేళ్లలో కోడింగ్ ప్రాధాన్యం కూడా తగ్గిపోతుందన్నారు. ఛాట్ జీపీటీలో నెఫుణ్యాన్ని సమకూర్చుకోవాలని, ఏపీఐ, ఫ్రేమ్ వర్క్ లతో ఎలా పనిచేయాలో నేర్చుకోవాలని సూచించారు. ప్రస్తుత ఆర్థిక మాంద్యం నేపథ్యంలో పట్టభద్రులకు ఉన్నత విద్యాభ్యాసం ఉత్తమమన్నారు. సిగ్నిటీలో టాలెంట్ అక్విజిషన్ సీనియర్ ఉపాధ్యక్షుడు కరుణా వెంపల మాట్లాడుతూ, పరిశ్రమలో రాణించడానికి మంచి భావ ప్రకటనా నైపుణ్యం, సాంకేతిక సామర్థ్యాలను పెంపొందించుకోవడం అవశ్యమన్నారు. కాలిన్స్ ఏరోస్పేస్ అసోసియేట్ డైరక్టర్ జైపాల్ సింగ్ మాట్లాడుతూ, భారత ప్రభుత్వం తయారీ రంగంపై దృష్టి సారించిందని, మరో రెండు దశాబ్దాలు ఈ ఒరవడి కొనసాగే వీలున్నందున, విద్యార్థులు తమ నెపుణ్యాలను పరిశ్రమల పోకడలకు అనుగుణంగా మార్చుకోవాలని సూచించారు.
ఏటీఎంఈసీఎస్ సీనియర్ డైరక్టర్ (ఇంజనీరింగ్) భాను ప్రకాష్ మాట్లాడుతూ, కోడింగ్, టెస్టింగ్, కృత్రిము మేథ వంటి వాటిలో నెపుణ్యాలను మెరుగుపరచుకోవడం ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. గ్లోబల్ మానవ వనరుల విభాగాధిపతి నరేన్ గుండాబత్తుల మాట్లాడుతూ, ఇంజనీర్లు బాగా ఆలోచించడం, సమస్యలను పరిష్కరించడం అలవరచుకోవాలని హితబోధ చేశారు.గీతం కోర్ ఇంజనీరింగ్ డీన్ ప్రొఫెసర్ వీ.ఆర్.శాస్త్రి మాట్లాడుతూ, పరిశ్రమ-విద్యా సంస్థల మధ్య స్థిరమెనై భాగస్వామ్యు ఆవశ్యకతను నొక్కి చెప్పారు. ఈ రెండింటి మధ్య అంతరం తగ్గాల్సిన ఆవశ్యకత ఉందని గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ అసోసియేట్ డైరక్టర్ ప్రొఫెసర్ ఎన్.సీతారామయ్య అన్నారు.తొలుత, ఈ కార్యక్రమాన్ని కెరీర్ గైడెన్స్ కేంద్రం డైరక్టర్ ప్రొఫెసర్ నాతి వేణుకుమార్ ప్రారంభిస్తూ, పరస్పర సహకారాన్ని పెంపొందించడం, సవాళ్లను పరిష్కరించడం, సమాజాభివృద్ధి కోసం సాంకేతికతను అభివృద్ధి చేయడం లక్ష్యంగా దీనిని నిర్వహిస్తున్నామంటూ, అతిథులను స్వాగతించారు. చివరగా, కెరీర్ ఫుల్ ఫిల్ మెంట్ డిప్యూటీ డైరక్టర్ టి.లోకేష్ వందన సమర్పణతో ఈ ఒకరోజు కాంక్లేవ్ ముగిసింది.