_గీతమ్ లో మొదలైన ప్రమాణ సందడి
_ఫిబ్రవరి 8 నుంచి 10వ తేదీ వరకు అలరించనున్న సాంకేతిక, సాంస్కృతిక కార్యక్రమాలు
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
హైదరాబాద్ గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం ప్రతియేటా నిర్వహించే మూడు రోజుల సాంకేతిక, సాంస్కృ తిక పండుగ ఫిబ్రవరి 8 నుంచి 10వ తేదీ వరకు అలరించనున్నది. ఈ విషయాన్ని స్టూడెంట్ లైఫ్ ప్రతినిధులు వెల్లడించారు. విద్యార్థులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ కార్యక్రమంలో విభిన్నమైన సాంకేతిక, సాంస్కృతిక కార్యక్రమాల మేలు కలయికగా సాగుతుందని, వేలాది మంది విద్యార్థులను ఈ ఫెస్ట్ ఆకర్షించడమే గాక వారిలోని ప్రతిభ, నైపుణ్యం, సాంస్కృతిక వినోదాన్ని ప్రదర్శించే వేదికగా ఉపకరిస్తుందన్నారు. ప్రమాణ-2024 ప్రచారంలో భాగంగా విద్యార్థులు ఫ్లాష్ మాబ్ ను నిర్వహించడంతో పాటు పలు కళాశాలలకు ఈ సమాచారాన్ని చేరవేసినట్టు వారు వివరించారు. ఇప్పటికే పలు సాంకేతిక కార్యక్రమాలు, వర్క్ షాప్ లు నిర్వహించామని పాల్గొన్న విద్యార్థులందరికీ ధ్రువీకరణ పత్రాలను అందజేశామన్నారు. అపోలో ఆస్పత్రుల సామాజిక సేవ (సీఎస్ఆర్) ఉపాధ్యక్షురాలు ఉపాసన కామినేని కొణిదెల ముఖ్య అతిథిగా, విశాఖ ఇండస్ట్రీస్ జాయింట్ మేనేజింగ్ డెరైక్టర్ గడ్డం వంశీకృష్ణ, ప్రారంభ వేడుకలలో ఆత్మీయ అతిథిగా పాల్గొని, ప్రమాణ-2024ను లాంఛనంగా ఆరంభిస్తారని తెలిపారు. ఎన్ టీ టీ డేటా బిజినెస్ సొల్యూషన్స్ ప్రాంతీయ అధినేత సంజీవ్ దేశ్ పాండే రెండో రోజు కార్యక్రమంలో పాల్గొని, ఈ ఫెస్ట్ సందర్భంగా నిర్వహించిన పోటీలలో ప్రతిభ చాటిన వారికి ప్రశంసా పత్రాలను అందజేస్తారన్నారు. తొలి రోజు నిర్వహించే త్రీవరీ బ్యాండ్ కు కొనసాగింపుగా రెండో రోజు రామ్ మిర్యాల, సాహితీ చాగంటి తను పాటలతో విద్యార్థులను ఉర్రూతలూగించనున్నట్టు తెలియజేశారు. బ్యాటిల్ ఆఫ్ బ్యాండ్స్, సంప్రదాయ నృత్యాలు, ర్యాంప్ వాక్, కార్నివాల్, ఆటో ఎక్స్ పో, విద్యార్థులతో స్కిట్లు, పలు ప్రదర్శనలతో పాటు మనదేశంలోనే పేరొందిన డీజే ప్రాజెక్టు 91, మధ్య స్కాట్లాండ్ కు చెందిన ప్రపంచ ప్రసిద్ధ డీజే నినా సూర్టే ఈ మూడు రోజుల ఫెస్ట్ లో ఆహూతుల జోష్ ను పెంచనున్నట్టు వారు వివరించారు.గీతం విద్యార్థులతో పాటు జంట నగరాల చుట్టుపక్కల నుంచి, ఇతర రాష్ట్రాల విద్యార్థులు కూడా ఈ ఫెస్ట్ లో పాల్గొనడానికి ఇప్పటికే పేర్లు నమోదు చేసుకున్నారని, దాదాపు ఇరవైవేల మంది పాల్గొననున్నట్టు స్టూడెంట్ లైఫ్ ప్రతినిధులు తెలియజేశారు.