అక్రమ నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు …
– జిల్లా పంచాయతీ అధికారి సురేష్ మోహన్
పటాన్ చెరు:
అక్రమ నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తప్పవని సంగారెడ్డి జిల్లా పంచాయతీ అధికారి సురేష్ మోహన్ హెచ్చరించారు.
మంగళవారం పటాన్ చెరు మండల పరిధిలోని ఇంద్రేశం గ్రామపంచాయతీ పరిధిలో మూడవరోజు అక్రమ నిర్మాణాల కూల్చివేతలను డీఎల్పీఓ సతీష్ రెడ్డి, ఇంద్రేశం గ్రామ పంచాయతీ కార్యదర్శి కిషోర్ ల తో కలిసి ఆయన పరిశీలించారు. అనంతరం జిల్లా పంచాయతీ అధికారి సురేష్ మోహన్ మాట్లాడుతూ… ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అనుమతి లేని నిర్మాణాలు చేపడితే వాటిని కూల్చివేసి, యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. అపార్ట్మెంట్లలో ప్రభుత్వ అనుమతులను సరి చూసుకోని ప్రజలు కొనుగోలు చేసుకోవాలని సూచించారు. అపార్ట్మెంట్ యజమానుల మాయమాటలకు ప్రజలు మోసపోవద్దని, అనుమతి లేని నిర్మాణాలను నిర్మూలించడంలో విఫలమైనందున ఇంద్రేశం, కిష్టారెడ్డిపేట గ్రామ పంచాయతీల సర్పంచ్, ఉప సర్పంచ్ లకు షోకాజ్ నోటీసులు జారీ చేశామని గుర్తు చేశారు. రానున్న రోజుల్లో గ్రామ పంచాయతీలలో ఇలాగే జరిగితే పంచాయతీ పాలకవర్గాన్ని మొత్తాన్ని సస్పెండ్ చేసే అధికారం జిల్లా కలెక్టర్ కు ఉంటుందని తెలిపారు. అక్రమ నిర్మాణాలను చేపడితే ఎంతటివారి పైన అయినా క్రిమినల్ కేసులు చేపడతామని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు. అదే విధంగా అమీన్ పూర్ మండలం పటేల్ గూడ గ్రామపంచాయతీ పరిధిలో డీఎల్పీఓ సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో అక్రమ నిర్మాణాలను కూల్చి వేశారు.