బల్దియా అభివృద్ధి పనుల్లో వేగం పెంచండి పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి

politics Telangana

ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు

27, 28 తేదీలలో అమీన్పూర్, పటాన్‌చెరు సర్కిల్ పరిధిలో 9 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:

పటాన్‌చెరు, అమీన్పూర్ జిహెచ్ఎంసి సర్కిళ్ల పరిధిలోగల డివిజన్లలో మంజూరైన అభివృద్ధి పనులను నిర్దేశించిన గడువులోగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొని రావాలని పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అధికారులను ఆదేశించారు.శుక్రవారం ఉదయం పటాన్‌చెరు డివిజన్ పరిధిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో  అమీన్పూర్ సర్కిల్, పటాన్‌చెరు సర్కిల్ డిప్యూటీ కమిషనర్లు, ఇంజనీరింగ్ విభాగం అధికారులతో ఎమ్మెల్యే జిఎంఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా రెండు సర్కిళ్ల పరిధిలో చేపడుతున్న అభివృద్ధి పనుల వివరాలను ఎమ్మెల్యే జిఎంఆర్ కు అధికారులు అందించారు. ఇటీవల బల్దియా పరిధిలో నూతనంగా ఏర్పడిన బొల్లారం, అమీన్పూర్, తెల్లాపూర్, ముత్తంగి, జేపీ కాలనీ, బీరంగూడ డివిజన్ల పరిధిలో ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలకు రూపకల్పన చేయాలని సూచించారు. ప్రధానంగా సిసి రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీల నిర్మాణ పనులకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. మంజూరైన పనులను నిరంతరం పర్యవేక్షిస్తూ గడువులోగా పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొని రావాలని సూచించారు. నాణ్యత విషయంలో రాజీ పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈనెల 27న భారతి నగర్, రామచంద్రపురం, 28న పటాన్‌చెరు డివిజన్ల పరిధిలో 9 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయబోతున్నట్లు తెలిపారు. మరిన్ని అభివృద్ధి పనుల కోసం నిధులు కేటాయించాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు.ఈ సమావేశంలో పటాన్‌చెరు డిప్యూటీ కమిషనర్ సురేష్, అమీన్పూర్ డిప్యూటీ కమిషనర్ ప్రదీప్ కుమార్ , ఈఈ సురేష్, డిఈ వెంకటరమణ, ఏఈలు సునీల్, శివ, దివ్యతేజ, లావణ్య, తేజశ్రీ, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *