మహిళా రిజర్వేషన్ బిల్లును వెంటనే అమలు చేయాలి: కాంగ్రెస్ నేతల డిమాండ్

politics Telangana

పటాన్‌చెరులో మహిళా కాంగ్రెస్ శక్తి ప్రదర్శన

గ్రామ స్థాయి నుంచి బూత్ స్థాయి వరకు పార్టీ బలోపేతంపై దిశానిర్దేశం

మనవార్తలు ప్రతినిధి , రామచంద్రపురం :

పటాన్‌చెరు నియోజకవర్గంలో మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగిన ముఖ్య సమావేశం రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించింది. మహిళల రాజకీయ, సామాజిక, ఆర్థిక సాధికారతకు కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ కట్టుబడి ఉందని నాయకులు స్పష్టం చేశారు. సంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాట సుధా శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో రామచంద్రాపురం బాలాజీ గార్డెన్స్‌లో నిర్వహించిన సమావేశానికి ముఖ్య అతిధులుగా జాతీయ మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కమలాక్షి, రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి, డీసీసీ అధ్యక్షురాలు, టీజీఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు అంజలి హాజరయ్యారు .

అనంతరం టీజీఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి మాట్లాడుతూ మహిళా కాంగ్రెస్‌ను గ్రామ స్థాయి నుంచి బూత్ స్థాయి వరకు మరింత పటిష్ఠం చేయాల్సిన అవసరంపై నాయకులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. పార్టీ కార్యక్రమాల్లో మహిళల భాగస్వామ్యాన్ని పెంచడం, ప్రతి గ్రామంలో, ప్రతి వార్డులో, ప్రతి బూత్‌లో మహిళా కాంగ్రెస్‌ను క్రియాశీలంగా మార్చడం ద్వారా కాంగ్రెస్ బలాన్ని మరింత పెంచాలని పిలుపునిచ్చారు. పార్టీ సిద్ధాంతాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, మహిళల హక్కులపై అవగాహన కల్పిస్తూ క్షేత్రస్థాయిలో బలమైన నెట్‌వర్క్‌ను నిర్మించాలని సూచించారు.

కాట సుధా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ మహిళలకు శాసనసభలు, పార్లమెంట్‌లో 33 శాతం రిజర్వేషన్ కల్పించే మహిళా రిజర్వేషన్ బిల్లును తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. చట్టరూపం దాల్చిన ఈ బిల్లును అమలు చేయడంలో జరుగుతున్న జాప్యం మహిళల రాజకీయ హక్కులను అణచివేయడమేనని ఆరోపించారు. మహిళలకు సముచిత రాజకీయ ప్రాతినిధ్యం కల్పించకుండా ప్రజాస్వామ్యం సంపూర్ణం కాదని, మహిళా శక్తిని గుర్తించకుండా దేశ అభివృద్ధి సాధ్యం కాదనిఅమె తెలిపారు.

కాంగ్రెస్ పార్టీ మహిళా సాధికారతను కేవలం నినాదంగా కాకుండా పాలనలో భాగంగా అమలు చేస్తోందని రాష్ట్ర ప్రభుత్వం మహిళల సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకెళ్లాలని, వాటి ప్రయోజనాలు ప్రతి అర్హ మహిళకు చేరేలా కృషి చేయాలని సూచించారు. మహిళల ఆర్థిక స్వావలంబన, విద్య, ఉపాధి, రాజకీయ ప్రాతినిధ్యం వంటి అంశాల్లో కాంగ్రెస్ పార్టీ ముందుండి పోరాడుతోందని తెలిపారు.మహిళా కాంగ్రెస్ నాయకత్వం బలపడితేనే పార్టీ గ్రామస్థాయిలో మరింత పటిష్ఠమవుతుందని, రాబోయే రోజుల్లో మహిళా కాంగ్రెస్‌ను ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లేందుకు సమన్వయంతో పనిచేయాలని నేతలు పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *