మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు:
నైపుణ్యాభివృద్ధి, కెరీర్ అభివృద్ధి, పరిశ్రమకు సంసిద్ధత, ప్రపంచ ఉన్నత విద్యపై అవగాహనను విద్యార్థులలో పెంపొందించడానికి గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం ‘జూన్ 2026 సెషన్ సిరీస్’ పేరిట ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ విషయాన్ని గీతం కెరీర్ గైడెన్స్ సెంటర్ (జీసీజీసీ)లోని శిక్షణ, మార్గదర్శకత్వం వృత్తిపరమైన సలహాలు (టీఎంసీజీ) డైరెక్టర్ డాక్టర్ రోజీనా మాథ్యూ శుక్రవారం విడుదల చేసి ఒక ప్రకటనలో వెల్లడించారు.విజయవంతమైన పూర్వ విద్యార్థులు, పరిశ్రమ నిపుణులు, పరిశోధకులు, విభిన్న రంగాలకు చెందిన నిపుణులతో గీతం విద్యార్థులను అనుసంధానించడంలో టీఎంసీజీ వేదిక కీలక పాత్ర పోషిస్తోందన్నారు. ఈ పరస్పర సంభాషణల ద్వారా, విద్యార్థులు తరగతి గది అభ్యాసానికి తోడ్పడే ఆచరణాత్మక అంతర్దృష్టులను పొందుతారని, ఇవి వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రపంచంలో విజయవంతమైన కెరీర్ల కోసం వారిని సిద్ధం చేస్తారని వివరించారు.‘జూన్ 2026 సెషన్ సిరీస్’లో, ప్రముఖ పూర్వ విద్యార్థులు, పరిశ్రమ నిపుణులు వర్ధమాన కెరీర్ అవకాశాలు, విదేశాలలో ఉన్నత విద్య, కృత్రిమ మేధస్సు (ఏఐ), ప్రొడక్ట్ మేనేజ్ మెంట్, డేటా అనలిటిక్స్ వంటి అంశాలపై తమ అభిప్రాయాలను, నైపుణ్యాన్ని గీతం విద్యార్థులతో పంచుకుంటారని ఆమె పేర్కొన్నారు.
ఇందులో భాగంగా, జూన్ 11న, ‘సరిహద్దులకు ఆవల: అమెరికాలో కృత్రిమ మేధస్సు అధ్యయన ప్రయాణం’ అనే అంశంపై యూనివర్సిటీ ఆఫ్ సిన్సినాటి మాస్టర్స్ విద్యార్థిని శ్రీజ నల్లమోతు ప్రసంగిస్తారని తెలిపారు. జూన్ 12న, ‘సరిహద్దులకు ఆవల: విదేశాలలో ఉన్నత విద్యకు మీ ప్రయాణం’ అనే అంశంపై యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ ఎట్ డల్లాస్ పట్టభద్రుడు హార్దిక్ మల్లిచెట్టి ఉపన్యసిస్తారన్నారు. జూన్ 14న, ‘ఉత్పత్తి సంబంధిత పాత్రలను’ గ్లోబల్ డేటా పీఎల్సీ ప్రొడక్ట్ అనలిస్ట్ వంశిక సాయి బొత్స పరిచయం చేస్తారని వెల్లడించారు. జూన్ 15న, ‘యూనివర్సిటీ ఆఫ్ హ్యూస్టన్ కు ప్రయాణం’ అనే అంశంపై అక్కడి రీసెర్చ్ అసిస్టెంట్ ఆకాంక్ష గోవిందరాజు వివరిస్తారన్నారు. జూన్ 21న, ‘డేటా అనలిటిక్స్ భవిష్యత్తును నడిపించడం: కృత్రిమ మేధస్సు, నైపుణ్యాలు, కెరీర్’ అనే అంశంపై ఎంఎస్డీ డేటా సైన్స్ మేనేజర్ సమీక్ష నిమ్జే ఉపన్యసిస్తారని తెలిపారు. జూన్ 23న, ‘విదేశాలలో ఉన్నత విద్యలో చేరడానికి సరైన సమయాన్ని విశ్లేషించడం’పై నార్త్ కరోలినా స్టేట్ యూనివర్సిటీ మాస్టర్స్ విద్యార్థిని ఎన్.శ్రేయారెడ్డి సలహాలిస్తారన్నారు. జూన్ 26న, ‘స్పష్టతతో, లక్ష్యంతో విదేశాలలో ఎలా చదువుకోవాలి’ అనే అంశంపై పోలాండ్ లోని కోజ్మిన్స్కి విశ్వవిద్యాలయం మాస్టర్స్ విద్యార్థి సాయిరామ్ నాగేష్ మార్గదర్శనం చేస్తారని తెలియజేశారు.
వీటి ముఖ్య ఉద్దేశం, విద్యార్థులకు అభివృద్ధి చెందుతున్న పరిశ్రమ పోకడలను అర్థం చేసుకోవడం, ప్రపంచవ్యాప్త విద్యావకాశాలను అన్వేషించడం, విదేశాలలో పనిచేస్తున్న, చదువుతున్న పూర్వ విద్యార్థుల నుంచి లోతైన అవగాహనను పొందడం, వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగాలలో విజయవంతమైన వృత్తి జీవితానికి అవసరమైన నైపుణ్యాలను పెంపొందించుకోవడంలో సహాయపడటమని డాక్టర్ రోజీనా వివరించారు.ఆయా సెషన్లలో విద్యార్థులు చురుకుగా పాల్గొనాలని, వక్తలతో సంభాషించాలని, అలాగే తమ విద్య, వృత్తి జీవితాల గురించి సరైన నిర్ణయాలు తీసుకోవాలని డాక్టర్ మాథ్యూ విద్యార్థులను ప్రోత్సహించారు. విద్యార్థులు అనుసరించాలనుకుంటున్న మార్గంలో ఇప్పటికే విజయవంతంగా పయనించిన వ్యక్తుల నుంచి నేర్చుకోవడానికి ప్రతి సెషన్ ఒక అవకాశాన్ని అందిస్తుంది. ఈరోజు తీసుకునే నిర్ణయాలే రేపటి అవకాశాలను తీర్చిదిద్దుతాయి’’ అని ఆమె అన్నారు. ఇప్పటివరకు టీఎంసీజీ వివిధ రంగాలలో 149 నైపుణ్యాభివృద్ధి సెషన్లను విజయవంతంగా నిర్వహించిందని, తద్వారా వందలాది విద్యార్థులకు మార్గదర్శనం, పరిశ్రమ అనుభవం, ఉన్నత విద్యపై అవగాహన కలిగినట్టు డాక్టర్ రోజీనా మాథ్యూ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
