మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు:
గీతం అధ్యాపకుల కృషి మరోసారి విద్యారంగ నిపుణుల ప్రశంసలను అందుకుంది. హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ బిజినెస్ లో అకౌంటింగ్ అండ్ ఫైనాన్స్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ పి. శ్రీధర్ ఫైనాన్స్ ట్రాక్ లో మొదటి స్థానం పొంది, ఉత్తమ పత్ర అవార్డును గెలుచుకున్నారు. బెంగళూరులోని క్రైస్ట్ డీమ్డ్ విశ్వవిద్యాలయంలో ఇటీవల నిర్వహించిన వ్యాపార ఆవిష్కరణ, పరివర్తనపై అంతర్జాతీయ సమావేశం (ICFBIT 2026)లో ఆయన ఈ ప్రశంసలందుకున్నారు.‘స్థిరమైన పరివర్తన, ఆర్థిక మార్కెట్లు, పర్యావరణ హిత సాంకేతిక సంస్థలలో ఐబీసీ పాత్ర’ అనే శీర్షికన డాక్టర్ శ్రీధర్ సమర్పించిన పరిశోధనా పత్రం సమీక్ష మండలి మన్నననలను చూరగొంది. ఇది ఎంతో వాస్తవికంగా, లోతైన పరిశోధనతో, చక్కని భావ ప్రకటనలో ఎంతో స్పష్టంగా ఉందని ప్రశంసించింది. సదస్సు నిర్వాహక కమిటీ కూడా ఈ పత్రం విద్యాపరంగా అభిప్రాయాలను సూటిగా వెల్లడించిందని, సమావేశ ఇతివృత్తానికి సంబంధించిన ఔచిత్యానికి అనుగుణంగా ఉందని పేర్కొంది.గీతం హైదరాబాదు అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీ.ఎస్. రావు, రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, స్కూల్ ఆఫ్ బిజినెస్ డైరెక్టర్ డాక్టర్ దివ్య కీర్తి గుప్తాతో సహా గీతం నాయకత్వం ఈ విజయాన్ని సాధించిన డాక్టర్ శ్రీధర్ ను అభినందించింది. ఇదే స్ఫూర్తిని ఇక ముందు కూడా కొనసాగించమని ఆయనను ప్రోత్సహించింది.
