ఎమ్మెల్యే జిఎంఆర్ ఆధ్వర్యంలో సామూహిక వివాహాలు

politics Telangana

_వివాహ వేదిక: జిఎంఆర్ ఫంక్షన్ హాల్

_వివాహాల తేదీ: మే 7, 2023

_నిరుపేదలు సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి..

_త్వరలోనే ముస్లిం, క్రిస్టియన్ల సామూహిక వివాహాలు

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

దాతృత్వానికి, మంచితనానికి మారుపేరుగా నిలిచిన పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి మరో చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు.పటాన్చెరు నియోజకవర్గ పరిధిలో సామూహిక వివాహాలు జరిపించేందుకు నిర్ణయించారు.గురువారం పటాన్చెరు పట్టణంలోని మైత్రి మైదానంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సామూహిక వివాహాల కార్యక్రమ వివరాలను ఎమ్మెల్యే జిఎంఆర్ వెల్లడించారు.పటాన్చెరు నియోజకవర్గ అభివృద్ధిలో ప్రభుత్వంతోపాటు ప్రజలకు సేవలు అందించడంలో భాగంగా తమ కుటుంబం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జివిఆర్ ఎంటర్ప్రైజెస్ సౌజన్యంతో చేపడుతున్న సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా సామూహిక వివాహ కార్యక్రమాలు నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.ప్రజా ప్రతినిధులు, పుర ప్రముఖులు, వేద బ్రాహ్మణులతో చర్చించిన అనంతరం మే 7వ తేదీ, ఆదివారం పటాన్చెరు పట్టణంలోని జిఎంఆర్ ఫంక్షన్ హాల్ లో సంప్రదాయబద్ధంగా సామూహిక వివాహాలు జరిపేందుకు నిర్ణయం తీసుకోవడం జరిగిందని తెలిపారు.

మొదటగా హిందువుల సామూహిక వివాహాలు జరిపించిన అనంతరం, ముస్లిం, క్రిస్టియన్ల మత పెద్దలతో చర్చించి వారికి సంబంధించిన సామూహిక వివాహాల తేదీని ప్రకటిస్తామని తెలిపారు.దీనికోసం అర్హులైన హిందువుల జంటలు తమ తమ మండలాల పరిధిలోని ఎంపీడీవో, తహసిల్దార్ కార్యాలయాల్లో పేర్లను నమోదు చేసుకుని రసీదులు పొందాలని సూచించారు.సామూహిక వివాహాల్లో వివాహం చేసుకున్న జంటలకు ప్రభుత్వం తరఫున కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ పథకాలు వర్తింప చేస్తామని పేర్కొన్నారు.గతంలో తాను ఎంపీపీగా పని చేసినప్పుడు 20 జంటలకు సామూహిక వివాహాలు జరిపించినట్లు గుర్తు చేశారు.మానవసేవయే మాధవసేవ అన్న నానుడికి అనుగుణంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, భారత రాష్ట్ర సమితి సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *