పటాన్ చెరు, మనవార్తలు ప్రతినిధి :
గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం , హైదరాబాద్ లో అత్యాధునికంగా నిర్మించిన అవుట్డో డోర్ క్రీడా సదుపాయాలు , పునరుద్ధరించిన ఇండోర్ స్పోర్ట్స్ ప్రాంగణాలను విద్యార్థులు , సిబ్బంది హర్షధ్వానాల మధ్య గురువారం గీతం కార్యదర్శి ఎం.భరద్వాజ్ ప్రారంభించారు . ఈ క్రీడా సదుపాయంలో బాస్కెట్బాల్ , టెన్నిస్ కోసం సింథటిక్ యాక్రిలిక్ ఉపరితలాలతో కూడిన కోర్టులు , ఒక కృత్రిమ టర్ఫ్ మల్టీస్పోర్ట్ కోర్టు , బీచ్ వాలీబాల్ కోర్టులున్నాయి . ఇండోర్ కాంప్లెక్స్లో మూడు ఇండోర్ ఎయిర్ కండిషన్డ్ బ్యాడ్మింటన్ , ఒక కబడ్డీ కోర్టుతో పాటు టేబుల్ టెన్నిస్ , చెస్ , క్యారమ్ , ఫూస్బల్ వంటి క్రీడా సదుపాయాలను ఏర్పాటు చేశారు . వీటిని ప్రారంభించాక , గీతం కార్యదర్శి ఎం . భరద్వాజ్ మాట్లాడుతూ , క్రీడలు వ్యక్తిత్వం , క్రమశిక్షణ , బృంద స్ఫూర్తి , నాయకత్వ లక్షణాలతో పాటు జీవన నైపుణ్యాలను పెంపొందిస్తాయన్నారు . అత్యాధునిక శిక్షణా సౌకర్యాల వల్ల విద్యార్థులు తప్పకుండా ప్రయోజనం పొందుతారన్న విశ్వాసం వెలిబుచ్చారు . గీతం కార్యదర్శిని స్వాగతిస్తూ , నూతన , మెరుగుపరచిన క్రీడా సౌకర్యాలు గీతం హెదరాబాద్ ప్రాంగణానికి ఎంతో ముఖ్యమైనవని క్రీడల డెరైక్టర్ అరుణ్ కార్తీక్ అన్నారు .
శక్తివంతమైన , స్థిరమైన క్రీడా సంస్కృతిని నిర్మించాలన్న గీతం దూరదృష్టికి ఇవి దోహదపడగలవన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తపరిచారు . విస్తృత శ్రేణి క్రీడా శిక్షణ కార్యక్రమాలు , క్రీడా కోర్సులు , సాధారణ పోటీలు , వినోద కార్యక్రమాలను నిర్వహించడానికి క్రీడా సిబ్బంది , శిక్షకులకు ఈ సదుపాయాలు ఎంతో ఉపకరిస్తాయన్నారు . సురక్షితమైన ఆట , ఆరోగ్యకరమైన పోటీ , మెరుగైన సౌకర్యాలు కీలకపాత్ర పోషిస్తాయని , తద్వారా విద్యార్థుల సమగ్రాభివృద్ధికి తోడ్పడగలవని డెరైక్టర్ అభిప్రాయపడ్డారు . గీతం హెదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డీఎస్ రావు , రెసిడెంట్ డెరైక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ , పలువురు డెరైక్టర్లు , ప్రిన్సిపాళ్ళు , విభాగాధిపతులు , అధ్యాపకులు తదితరులు ఈ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు .