_ప్రజా ప్రతినిధులు, అధికారులతో సమీక్ష సమావేశం
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
మహాత్మగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని 45 గ్రామ పంచాయతీలకు 5 కోట్ల 25 లక్షల రూపాయల నిధులు మంజూరు అయ్యాయని, వీటిని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ఆయా గ్రామాల ప్రజా ప్రతినిధులకు సూచించారు. శుక్రవారం పటాన్చెరులోని జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో ఎమ్మెల్యే జిఎంఆర్ అధ్యక్షతన ఉపాధి హామీ పథకం నిధుల వినియోగంపై ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ద్వారా అందించే నిధులను ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించి ఖర్చు చేయాలని కోరారు. ప్రధానంగా సిసి రోడ్ల నిర్మాణానికి నిధులు వెచ్చించాలని సూచించారు. దీంతోపాటు 9 నూతన గ్రామపంచాయతీలలో పంచాయతీ భవనాల నిర్మాణ పనుల కోసం 20 లక్షల రూపాయల చొప్పున ఒక కోటి లక్షల రూపాయల నిధులు మంజూరు అయ్యాయని తెలిపారు. ఇంజనీరింగ్ అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసే నిధులను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.