మనవార్తలు ,పటాన్ చెరు:
సూపర్ – ఫినిషింగ్ లేత్ అటాచ్మెంట్ రూపకల్పన , విశ్లేషణ ‘ అనే అంశంపై సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించిన హెదరాబాద్ , గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలోని మెకానికల్ ఇంజనీరింగ్ విభాగం పరిశోధక విద్యార్థి సయ్యద్ లాయక్ బాబామియాను డాక్టరేట్ వరించింది . ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీలోని ఏరోస్పేస్ ఇంజనీరింగ్ విభాగం ప్రొఫెసర్ ఎ.సత్యాదేవి మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు . సూపర్ – ఫినిషింగ్ లేత్ అటాచ్మెంట్ ఎదుర్కొంటున్న సమస్యను కనుగొనడానికి ఈ పరిశోధన చేపట్టామని , లేత్ పనిచేసేటప్పుడు స్లీవ్ ఉష్ణ విస్తరణ కారణంగా డోలనం చేసే పిస్టన్ స్లీవ్లో మొరాయిస్తోందని విశ్లేషించినట్టు ఆయన తెలియజేశారు .
స్లీవ్ లోపలి భాగంలో గట్టి రబ్బరు పూత పూయడం ద్వారా ఓ పరిష్కారాన్ని సూచించామని , ఇది చాలా తక్కువ ఉష్ణ వాహకతను కలిగి ఉంటుందని , ఉష్ణోగ్రత పెరుగుదల కూడా చాలా తక్కువగా ఉంటుందని పేర్కొన్నారు . ట్రైబ్రోమీటర్లో నిర్వహించిన పరీక్షతో దీనిని నిర్ధారించామని తెలిపారు . దానితోపాటు పిస్టన్కు కిరీటాన్ని అమర్చడంతో పాటు స్లీవ్ బయటి ఉపరితలంపై అధిక – ఉష్ణోగ్రత ఇన్సులేషన్ పూత పూశామని , ఇది వేడిచేసిన సిలిండర్ , గట్టి రబ్బరు పూత మధ్య అవరోధంగా పనిచేస్తుందని రుజువు చేశామన్నారు . బాబామియా సమర్పించిన సిద్ధాంత వ్యాసం పీహెచీ పట్టాకు అర్హత సాధించడం పట్ల గీతం విశ్వవిద్యాలయం , హైదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డీఎస్ రావు , గీతం రెసిడెంట్ డెరైక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ , స్కూల్ ఆఫ్ టెక్నాలజీ అసోసియేట్ డెరైక్టర్ ప్రొఫెసర్ ఎన్.సీతారామయ్య , పలు విభాగాల అధిపతులు , అధ్యాపకులు , సిబ్బంది పలువురు అభినందించినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు .