ఆల్విన్ కాలనీ చౌరస్తాలో భూమిపూజ నిర్వహించిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
నేటి తరం యువత శివాజీ మహారాజ్ జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి
నియోజకవర్గ వ్యాప్తంగా చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాల ఏర్పాటు
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు:
నేటి తరం యువత ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలన్న సమున్నత లక్ష్యంతో పటాన్చెరు నియోజకవర్గం వ్యాప్తంగా శివాజీ మహారాజ్ మహనీయుడి విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నామని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.ఆదివారం జెపి కాలనీ డివిజన్ పరిధిలోని ఆల్విన్ కాలనీ చౌరస్తాలో సొంత నిధులతో ఏర్పాటు చేయనున్న 12 అడుగుల చత్రపతి శివాజీ మహారాజ్ కాంస్య విగ్రహ ఏర్పాటు కోసం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి భూమి పూజ నిర్వహించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశభక్తి, ధైర్యసాహసాలు, స్వరాజ్య స్థాపనకు ప్రతీకగా నిలిచిన ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆదర్శాలు నేటి యువతకు స్ఫూర్తిదాయకమని అన్నారు. ధర్మరక్షణ, ప్రజాపాలన, మహిళల గౌరవ పరిరక్షణ, పరిపాలనా దక్షతలో శివాజీ మహారాజ్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచారని కొనియాడారు.నియోజకవర్గ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో సొంత నిధులతో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాలను ఏర్పాటు చేస్తూ, ఆయన గొప్పతనాన్ని భావితరాలకు చాటిచెప్పే కార్యక్రమాలను కొనసాగిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.రాబోయే మూడు నెలల్లోగా విగ్రహాన్ని ఏర్పాటు చేసి ప్రారంభించడం జరుగుతుందని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో స్థానిక మాజీ ప్రజాప్రతినిధులు, శివాజీ అభిమానులు, యువకులు, బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, విగ్రహ కమిటీ సభ్యులు, కాలనీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
