రసాయన శాస్త్రంలో నగరపు లక్ష్మీకుమారికి పీహెచ్.డీ.

Telangana

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు :

హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ సైన్స్, రసాయన శాస్త్ర విభాగం పరిశోధక విద్యార్థిని నగరపు లక్ష్మీకుమారి డాక్టరేట్ కు అర్హత సాధించారు. ‘క్లోఫరాబైన్, డెసిటాబైన్, బెలినోస్టాట్, బోర్టెజోమిబ్ తయారీలో కీలక మధ్యస్థ పదార్థాలు, క్రియాశీల ఔషధ పదార్థాల (ఏపీఐ) సంశ్లేషణకు అధునాతన విధానాల’పై ఆమె అధ్యయనం చేసి, సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించారు.ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ రసాయన శాస్త్ర విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ చిత్తలూరి సుధాకర్ శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు.డాక్టర్ కుమారి చేసిన డాక్టరల్ పరిశోధన, కీలకమైన ఔషధ మధ్యస్థ పదార్థాలు, క్రియాశీల ఔషధ పదార్థాల (ఏపీఐల) సంశ్లేషణ కోసం వినూత్న, సమర్థవంతమైన వ్యూహాలను అందిస్తుందన్నారు.

ఈ అధ్యయనం తేలికపాటి చర్య పరిస్థితులలో తక్కువ ఖర్చుతో కూడిన కారకాలను వినియోగించడం ద్వారా, పారిశ్రామిక వినియోగానికి అనువైన వేగవంతమైన, అధిక దిగుబడినిచ్చే, విస్తరించదగిన ప్రక్రియలను సూచిస్తోందని తెలిపారు. డాక్టర్ కుమారి పరిశోధన, క్యాన్సర్ నిరోధక మందుల అభివృద్ధికి గణనీయమైన అవకాశాలను అందించే ఆచరణాత్మక, పారిశ్రామిక-ఆధారిత సంశ్లేషణ పద్ధతులను పరిచయం చేస్తుందన్నారు. ప్రాణాలను కాపాడే ఈ చికిత్సా విధానాల తయారీలో ఎదురయ్యే కీలక సవాళ్లను పరిష్కరించడం ద్వారా, ఆమె పరిశోధన ఔషధ రసాయన శాస్త్రం, ఔషధ తయారీ రంగాలలో పురోగతికి గణనీయంగా దోహదపడుతుందని వెల్లడించారు.

డాక్టర్ లక్ష్మీకుమారి సిద్ధాంత వ్యాసం పీహెచ్.డీ. పట్టాకు అర్హత సాధించడం పట్ల గీతం హైదరాబాదు అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు, గీతం రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, స్కూల్ ఆఫ్ సైన్స్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం.రెజా, రసాయన శాస్త్ర విభాగాధిపతి డాక్టర గౌసియా బేగం, పలు విభాగాల అధిపతులు, అధ్యాపకులు, సిబ్బంది తదితరులు అభినందించినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.డాక్టర్ కుమారి సాధించిన ఈ విజయం ఆమె అంకితభావానికి నిదర్శనంగా నిలుస్తుందని, క్యాన్సర్ చికిత్సల భవిష్యత్తుకు ఒక విలువైన తోడ్పాటును అందిస్తుందన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *