రూ.25 లక్షల సొంత నిధులతో చోటి మసీదు భవన నిర్మాణానికి అండ
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు:
పరమత సహనం, సామరస్యానికి ప్రతీకగా నిలుస్తూ పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. పటాన్చెరు డివిజన్ పరిధిలోని ఎంజి రోడ్డు లో గల చోటి మసీదు ప్రార్థన స్థలానికి చెందిన స్థలంలో 25 లక్షల రూపాయల సొంత నిధులతో భవనాన్ని నిర్మించి మసీదు నిర్వాహకులకు అందించారు. ఈ మేరకు శుక్రవారం మత పెద్దల సమక్షంలో భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చోటి మసీదు ఆర్థిక అవసరాలు తీర్చడంలో నూతన భవనం సహాయకారిగా ఉంటుందని తెలిపారు. ప్రపంచంలోని అన్ని మతాలు శాంతి, ప్రేమ, మానవత్వాన్నే బోధిస్తాయని అన్నారు. మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరి మనోభావాలను గౌరవించడం ప్రజాప్రతినిధిగా తన బాధ్యత అని పేర్కొన్నారు. పటాన్చెరు నియోజకవర్గంలో అన్ని వర్గాల ప్రజలు సోదరభావంతో, పరస్పర గౌరవంతో జీవించే వాతావరణాన్ని మరింత బలోపేతం చేయడమే తన లక్ష్యమని తెలిపారు. నియోజకవర్గంలో పరమత సహనాన్ని పెంపొందించడంలో భాగంగా నేటి వరకు సొంత నిధులతో 200 లకు పైగా దేవాలయాలు, 100కు పైగా మసీదులు, 20 కి పైగా చర్చిలు నిర్మించడం జరిగిందని గుర్తు చేశారు. ఈ సందర్భంగా ముస్లిం పెద్దలు ఎమ్మెల్యే జిఎంఆర్కు కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఆయన చేపడుతున్న సేవా కార్యక్రమాలు ఆదర్శప్రాయమని కొనియాడారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, ముస్లిం మత పెద్దలు లియాకత్ అలీ, మొయిజుర్ రెహ్మాన్, ఇక్బాల్, వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.
