భానూరులోని భారత్ డైనమిక్స్ లిమిటెడ్ ను సందర్శించిన గీతం విద్యార్థులు

Telangana

క్షిపణి సాంకేతికపై ప్రత్యక్ష అవగాహన

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు:

గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాదులోని కంప్యూటర్ సైన్స్ అండ్ సిస్టమ్స్ ఇంజనీరింగ్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ (ఏఐడీఎస్) విభాగాల విద్యార్థులు, భారతదేశంలోని ప్రముఖ రక్షణ ఉత్పాదక సంస్థలలో ఒకటైన భానూరులోని భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (బీడీఎల్)ను సందర్శించి, భారతదేశపు అధునాతన క్షిపణి సాంకేతికతపై ప్రత్యక్ష అవగాహనతో పాటు విలువైన పారిశ్రామిక అనుభవాన్ని పొందారు.ఈ పర్యటన సందర్భంగా, విద్యార్థులు ఆధునిక క్షిపణి సాంకేతికతలపై ఒక విజ్జానదాయక సదస్సులో పాల్గొన్నారు. అలాగే వారికి మిలన్, కొంకుర్స్, ఇన్వర్, కొంకుర్స్-ఎం వంటి ట్యాంక్ విధ్వంసక గైడెడ్ క్షిపణి వ్యవస్థల గురించి బీడీఎల్ అధికారులు పరిచయం చేశారు. అంతే కాకుండా, ఆస్ట్రా గగనతల క్షిపణి, దానిని ఎస్.యూ-30, మిరాజ్ యుద్ధ విమానాలలో అనుసంధానించడం గురించి తెలుసుకునే అవకాశం కూడా వారికి లభించింది.

గీతం విద్యార్థి బృందం బీడీఎల్ లోని ప్రెసిషన్ మ్యానుఫ్యాక్చరింగ్ విభాగాన్ని పర్యటించి, అక్కడ అత్యంత కచ్చితత్వంతో కూడిన సీ.ఎన్.సీ. మెషిన్లు, కీలకమైన క్షిపణి భాగాల ఉత్పత్తిని ప్రత్యక్షంగా పరిశీలించారు. కొంకుర్స్ క్షిపణి లాంచర్ వ్యవస్థ ప్రత్యక్ష ప్రదర్శన, క్షిపణి అసెంబ్లీ విభాగాన్ని సందర్శించడం ద్వారా, అధునాతన క్షిపణి వ్యవస్థల తుది అసెంబ్లీ, మోహరింపు యంత్రాంగాల గురించి విద్యార్థులకు ప్రత్యక్ష అవగాహన కలిగింది.రక్షణ ఇంజనీరింగ్, ప్రెసిషన్ మ్యానుప్యాక్చరింగ్, ఆటోమేషన్, స్వదేశీ సాంకేతిక ఆవిష్కరణలపై విద్యార్థుల అవగాహనను గణనీయంగా పెంచింది. అదే సమయంలో, తరగతి గది అభ్యాసాన్ని పారిశ్రామిక అనుభవంతో అనుసంధానించడం ప్రాముఖ్యతను కూడా ఇది నొక్కి చెప్పింది.

గీతం స్కూల్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లోని కంప్యూటర్ సైన్స్ అండ్ సిస్టమ్స్ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన ప్రొఫెసర్ ప్రీతి అంబరీష్ పర్వేకర్ సమన్వయంతో జరిగిన ఈ పారిశ్రామిక పర్యటన, 30 మంది విద్యార్థులు, ఐదుగురు అధ్యాపకులకు భారతదేశపు స్వదేశీ క్షిపణి ఉత్పాదక సాంకేతికతలు, అధునాతన రక్షణ ఉత్పత్తి వ్యవస్థలను అర్థం చేసుకునే అవకాశాన్ని కల్పించింది.గీతం విద్యార్థి బృందాన్ని బీడీఎల్ మానవ వనరుల విభాగాధిపతి గంగయ్య స్వాగతించగా, అదే విభాగానికి చెందిన శిక్షణాధికారి నందని, ఇతర అధికారులు అవగాహనా కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులను ఉద్దేశించి బీడీఎల్ డిప్యూటీ జనరల్ మేనేజర్ (హెచ్ఆర్) నాగేశ్వరరావు, దేశ రక్షణ సామర్థ్యాలను బలోపేతం చేయడంలో క్రమశిక్షణ, సమష్టి కృషి, సాంకేతిక నైపుణ్యం యొక్క ప్రాముఖ్యతను వివరించారు.బీడీఎల్ యాజమాన్యం, సాంకేతిక నిపుణులు చూపిన ఆత్మీయ ఆతిథ్యానికి, అలాగే విద్యార్థులకు సుసంపన్నమైన అభ్యాస అనుభవాన్ని అందించినందుకు గీతం బృందం కృతజ్జతలు తెలియజేసింది. పారిశ్రామిక సందర్శనను విజయవంతంగా నిర్వహించి, భారతదేశ రక్షణ సాంకేతిక రంగంలో అనుభవపూర్వక అభ్యాసానికి వీలు కల్పించినందుకు ప్రొఫెసర్ ప్రీతి అంబరీష్ పర్వేకర్ ను ప్రత్యేకంగా అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *