ఏడాది గడిచిన అమలుకు నోచుకోని సీఎం రేవంత్ రెడ్డి కోటి రూపాయల హామీ
పరిశ్రమ యాజమాన్యానికి బంటుగా రాష్ట్ర ప్రభుత్వం
బాధితులకు నిరంతర సహకారం
బిపిఎల్ చౌరస్తాలో సిగాచి మృతులకు ఘన నివాళి
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు:
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సిగాచి దుర్ఘటన జరిగి ఏడాది గడిచిన నేటి వరకు మృతుల కుటుంబాలకు పూర్తి నష్టపరిహారం అందించడంలో పరిశ్రమ యాజమాన్యం, రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమయ్యాయని ఇది అత్యంత దుర్మార్గమని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా దుర్ఘటన స్థలం సాక్షిగా మృతి చెందిన ప్రతి కార్మికుడి కుటుంబానికి కోటి రూపాయల నష్టపరిహారం అందిస్తున్నామని ప్రకటించిన నేటి వరకు అమలు కాకపోవడం సిగ్గుచేటని విమర్శించారు.మృతి చెందిన కార్మికుల కుటుంబాలతో పాటు బాధితులకు సంపూర్ణ న్యాయం చేయకపోతే భారత రాష్ట్ర సమితి తరపున ప్రజా క్షేత్రంలో నిరంత పోరాటాలు చేస్తూనే ఉంటామని హెచ్చరించారు.సిగాచి దుర్ఘటన జరిగి నేటితో ఏడాది గడిచిన సందర్భంగా ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని పాశమైలారం బిపిఎల్ చౌరస్తాలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మృతుల చిత్రపటాలకు పూలమాల వేసి ఘన నివాళి అర్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ గత సంవత్సరం జూన్ 30వ తేదీన సిగాచి పరిశ్రమలో జరిగిన ఘోర ప్రమాదంలో ఘటనలో 54 మంది మృతి చెందగా..8 మంది ఆచూకీ తెలియకపోవడంతో పాటు 40 మంది తీవ్రంగా గాయపడి నేటికి నరకయాతన అనుభవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కుమారుడుని కోల్పోయిన తల్లిదండ్రులు భర్తను కోల్పోయిన భార్య తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలు బాధలు వర్ణనాతీతమని అన్నారు.పరిశ్రమ యాజమాన్యం నిర్లక్ష్యం మూలంగా జరిగిన ఘటనలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరి అత్యంత దారుణంగా తయారైందని దుయ్యబట్టారు. ఘటన జరిగిన ఆరు నెలల అనంతరం ఒకరిని మాత్రమే అరెస్టు చేసి యాజమాన్యానికి బంటుగా ప్రభుత్వం మారిందని విమర్శించారు. ప్రమాద స్థలం సాక్షిగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మృతి చెందిన ప్రతి కార్మికుడి కుటుంబానికి కోటి రూపాయలు ఇస్తామని మీడియా ముఖంగా ప్రకటించి నేటికి ఏడాది గడిచిన అమలు కాకపోవడం ప్రభుత్వ వైఖరికి అద్దం పడుతోందని విమర్శించారు. తమకు న్యాయం చేయాలంటూ బాధితుల కుటుంబాలు ప్రభుత్వ కార్యాలయాలు పరిశ్రమ యాజమాన్యాల చుట్టూ కాళ్లు అరిగేలా తిరుగుతున్న కనికరం చూపడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.కార్మికుల కోసం పోరాడుతున్న వారిని విమర్శించడం తప్ప బాధితులకు న్యాయం చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు.
మంత్రి వివేక్ వెంకటస్వామి రూ.60 లక్షల పరిహారం అందించామని చెబుతున్నది అసత్యమని, సెబీలో రూ.118 కోట్ల పరిహారం చెల్లించాల్సి ఉందని వెల్లడించారని గుర్తుచేశారు. బిఆర్ఎస్ పార్టీ ఒత్తిడి కారణంగానే ప్రభుత్వం రూ.25 లక్షల పరిహారం ఇచ్చిందని, బాధిత కుటుంబాల పట్ల ప్రభుత్వానికి కనికరం లేదని మండిపడ్డారు.మృతుల కుటుంబాలకు నివాళి అర్పించేందుకు సమావేశం ఏర్పాటు చేసుకుంటామంటే అనుమతించకపోవడం ప్రభుత్వ దుర్మార్గ వైఖరికి అర్థం పడుతోందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి మృతుల కుటుంబాలకు కోటి రూపాయలు నష్టపరిహారం పూర్తిగా చెల్లించడంతోపాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, జీవితాంతం పెన్షన్ అందించాలని ఎమ్మెల్యే జిఎంఆర్ డిమాండ్ చేశారు. లేని పక్షంలో భారత రాష్ట్ర సమితి తరపున నిరంతర పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని ప్రజా ప్రతినిధులు, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, కార్మికులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
