మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు:
హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ లోని లలిత, ప్రదర్శన కళల విభాగం ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన మోహినియాట్టం యుగళ నృత్య ప్రదర్శన ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. నిష్ణాతులైన నర్తకులు నీమా నిఖిల్, వీణా ఉన్నికృష్ణన్ గీతం డాన్స్ స్టూడియోలో ఈ ప్రదర్శనతో ఆహూతులను అలరించారు.గీతంలోని నృత్య అధ్యాపకురాలైన మైథిలి మరట్ అనూప్ సీనియర్ శిష్యులైన ఈ ప్రదర్శకులు, ఆమె ప్రఖ్యాత బృందానికి ప్రాతినిధ్యం వహిస్తూ అనేక ప్రతిష్టాత్మక సాంస్కృతిక ఉత్సవాలతో పాటు జాతీయ వేదికలపై ప్రదర్శనలు ఇచ్చారు. ఇద్దరు నర్తకులు మోహినియాట్టంలో డిప్లొమాలు కలిగి ఉండగా, నీమా నిఖిల్ దూరదర్శన్ గ్రేడెడ్ కళాకారిణి కూడా. ఇది శాస్త్రీయ నృత్య సంప్రదాయంలో ఆమెకున్న ప్రావీణ్యాన్ని ప్రతింబిస్తుంది.
లలితా సహస్రనామం నుంచి ఎంపిక చేసిన శ్లోకాల ఆధారంగా, కేరళ యొక్క విశిష్టమైన భక్తి, నాటకీయ సంగీత సంప్రదాయమైన భావోద్వేగభరితమైన సోపాన సంగీతానికి అనుగుణంగా, మైథిలి మరట్ అనూప్ నృత్య దర్శకత్వం వహించిన హృద్యమైన దేవిస్తుతితో ఈ ప్రదర్శన ప్రారంభమైంది. మోహినియాట్టానికి నిర్వచనం ఇచ్చే సౌందర్యం, భక్తి, భావయుక్తమైన సొగసును ఈ ప్రదర్శన అద్భుతంగా ఆవిష్కరించింది. రెండవ ప్రదర్శనగా మహారాజా స్వాతి తిరునాల్ స్వరపరిచిన ఉత్సాహభరితమైన పండుగ సంగీత రూపకం ‘ఉత్సవప్రబంధం’ ప్రదర్శించారు.భావయుక్తమైన కథనం, సుందరమైన అభినయం ద్వారా, నృత్యకారులు ఒక అద్భుతమైన బంగారు తామర ఆకారపు రథంపై విచ్చేసిన దేవత ఎవరనే దానిపై ఒక ఊహాగానాల ఆటగా సాగే సరదా సంభాషణను ప్రదర్శించారు. ఆ దైవ స్వరూపం దేవతల రాజు అయిన ఇంద్రుడని ఒక నృత్యకారిణి సూచిస్తే, ఇంద్రునికి వెయ్యి కళ్ళు ఉండాలని మరొకరు ప్రతివాదన చేస్తారు. చంద్రునికి ఉండే మచ్చ లేకపోవడం వల్ల, ఆయన గుర్తింపు కూడా ప్రశ్నించేలా చంద్రుడితో సహా ఇతర దైవిక అవకాశాలతో ఈ సంభాషణ కొనసాగుతుంది. ఆసక్తికరమైన ఈ సంభాషణ చివరికి, ఆ దైవం సాక్షాత్తు పద్మనాభ స్వామి అని వెల్లడి కావడంతో ముగిసింది. దాని గేయ సౌందర్యం, నాటకీయ ఆకర్షణతో ఇది ప్రేక్షకులను ఆనందపరిచింది.
ఈ ప్రదర్శన ప్రఖ్యాత డాక్టర్ ఎం.బాలమురళీకృష్ణ స్వరపరిచిన ఉత్సాహభరితమైన ‘థిల్లాన’తో ముగిసింది. లయబద్ధమైన వైభవాన్ని, సుందరమైన కదలికలను మేళవించిన తెలుగు సాహిత్యం ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. అధ్యాపక బృందం, విద్యార్థులు, కళాభిమానులు ఈ ప్రదర్శనను ఘనంగా ప్రశంసించారు. నృత్యకారుల సాంకేతిక నైపుణ్యం, భావవ్యక్తీకరణ, రంగస్థల ప్రదర్శన పట్ల వారికున్న అభిరుచిని అభినందించారు.ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ, కళాత్మక నైపుణ్యాన్ని పెంపొందించడానికి, భారతదేశపు గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించడానికి, నిష్ణాతులైన కళాకారులతో క్రమం తప్పని ప్రదర్శనలు, సంభాషణల ద్వారా గీతం హైదరాబాదు ప్రాంగణంలో ఉత్సాహభరితమైన సృజనాత్మక వాతావరణాన్ని సృష్టించడానికి లలిత, ప్రదర్శన కళల విభాగం చేస్తున్న నిరంతర ప్రయత్నాలలో ఇటువంటి కార్యక్రమాలు ఒక భాగమని పేర్కొన్నారు.
సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పని చేయండి పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: పటాన్చెరు, గుమ్మడిదల మండల…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: రుద్రారం పెద్ద చెరువులో చేపల మృతికి కారణమైన పరిశ్రమల యాజమాన్యాల పైన చర్యలు తీసుకోవాలని సిపిఎం పార్టీ…
ప్రభుత్వం చేపడుతున్న భూసేకరణలో 113 సర్వే నెంబర్ల రైతులందరికి నష్టపరిహారం చెల్లించాలి మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: చిన్న కంజర్ల భూభాగోతంపైన సమగ్రమైన…
మనవార్తలు ప్రతినిధి,రామచంద్రపురం: పటాన్చెరు నియోజకవర్గంలోని ఆర్సీ పురం 268 డివిజన్లో బీఆర్ఎస్ పార్టీ తరపున బస్తీ దర్శన్ కార్యక్రమాన్ని సంగారెడ్డి…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: తెలంగాణ సంస్కృతిలో బోనాల పండుగకు ప్రత్యేక స్థానం ఉంది అని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్…
ముత్తంగిలో ఘనంగా విశ్వభారతి కాలేజ్ ఆఫ్ లా నూతన భవనం ప్రారంభం మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: ప్రతి పౌరుడు రాజ్యాంగాన్ని తప్పనిసరిగా…