అమీన్పూర్ డివిజన్ పరిధిలోని సన్ వే ఓపస్, ప్రైడ్ పార్కు కాలనీలో 5 కోట్ల 20 లక్షల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన
అమీన్పూర్, మనవార్తలు ప్రతినిధి :
అమీన్పూర్, పటాన్చెరు సర్కిళ్ల పరిధిలోని ప్రతి కాలనీని అన్ని రంగాల్లో సమగ్ర అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. మంగళవారం ఉదయం అమీన్పూర్ డివిజన్ పరిధిలోని ప్రైడ్ పార్కు కాలనీ, సన్ వే ఓపస్ కాలనీలలో ఐదు కోట్ల 20 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు, డివైడర్, ఫుట్ పాత్, మంచినీటి పైపులైన్ల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్యఅతిథిగా హాజరై శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులకు నిధులు కేటాయిస్తున్నామని తెలిపారు. ప్రతి కాలనీలో సిసి రోడ్లు, అంతర్గత మురుగునీటి కాలువలు, పార్కులు. వీధి దీపాలు, మంచినీటి పైపులైన్లు వేయడంతో పాటు అభివృద్ధిలో ప్రతి ఒక్కరిని భాగస్వాములను చేస్తున్నామని తెలిపారు.
అమీన్పూర్ ను గ్రామపంచాయతీ నుండి మున్సిపాలిటీగా మున్సిపాలిటీ నుంచి నగరపాలక సంస్థ గా అప్గ్రేడ్ చేయడంతో పాటు దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న మంచినీటి సమస్యను పరిష్కరించడం జరిగిందని గుర్తు చేశారు. అమీన్పూర్, బీరంగూడ పరిధిలో శరవేగంగా నూతన కాలనీలు ఏర్పడుతున్నాయని ప్రతి కాలనీలో మౌలిక వసతుల కల్పనకు ప్రతిపాదనను సిద్ధం చేస్తున్నామని తెలిపారు.నిర్దేశించిన గడువులోగా అభివృద్ధి పనులు పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొని రావాలని అధికారులకు సూచించారు.ఈ కార్యక్రమంలో అమీన్పూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, మాజీ ఎంపీపీ దేవానందం, మాజీ జెడ్పిటిసి సుధాకర్ రెడ్డి, ఇంజనీరింగ్ విభాగం డిఈ వెంకటరమణ, సీనియర్ నాయకులు ఉపేందర్, జగదీష్, రాజు, చంద్రశేఖర్, తలారి రాములు, గోపాల్, సునీత, రవి గౌడ్, మహిపాల్, కాలనీ అధ్యక్షులు రాజశేఖర్ రెడ్డి, కాలనీ సంక్షేమ సంఘం సభ్యులు పాల్గొన్నారు.
