మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు:
2025 జూన్ 30న సంగారెడ్డి జిల్లా పాశమైలారం లోని సిగాచి ఇండస్ట్రీస్లో జరిగిన ఘోర పారిశ్రామిక ప్రమాదానికి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా, బాధిత కుటుంబాలకు పూర్తి స్థాయిలో న్యాయం జరిగేలా కేంద్ర బొగ్గు మరియు గనుల శాఖ మంత్రి, సికింద్రాబాద్ ఎంపీ శ్రీ జి. కిషన్ రెడ్డి గారికి వినతిపత్రం సమర్పించినట్లు నవభారత్ నిర్మాణ యువసేన వ్యవస్థాపక అధ్యక్షులు, యువజన సంఘాల సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెట్టు శ్రీధర్ తెలిపారు.మరణించిన కార్మికుల కుటుంబాలకు ప్రభుత్వం ప్రకటించిన రూ.1 కోటి నష్టపరిహారం పూర్తిగా అందేలా తెలంగాణ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని, ఇంకా చెల్లించాల్సిన మిగిలిన పరిహారాన్ని వెంటనే విడుదల చేయాలని ఆయన కోరారు. అలాగే గాయపడిన బాధితులకు సమగ్ర పునరావాసం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.ఈ ప్రమాదానికి దారితీసిన భద్రతా లోపాలు, తనిఖీలలో నిర్లక్ష్యం ప్రదర్శించిన అధికారులపై శాఖాపరమైన మరియు చట్టపరమైన చర్యలు తీసుకొని బాధ్యులను శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.భవిష్యత్తులో ఇలాంటి విషాద ఘటనలు పునరావృతం కాకుండా పారిశ్రామిక భద్రతా నిబంధనలను మరింత కఠినంగా అమలు చేయడంతో పాటు, పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాల అమలును పటిష్టం చేయడానికి కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.సిగాచి ప్రమాద బాధిత కుటుంబాలకు న్యాయం, బాధ్యులపై చర్యలు, బాధితుల గౌరవప్రదమైన పునరావాసం కోసం కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని మెట్టు శ్రీధర్ విజ్ఞప్తి చేశారు.
