_రుద్రారం గ్రామంలో ఘనంగా పల్లె ప్రగతి దినోత్సవం
_సిద్ది గణపతి దేవాలయం ఆవరణలో హరిత హారం
_సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
పటాన్చెరు,మనవార్తలు ప్రతినిధి :
పల్లెలే దేశానికి పట్టుకొమ్మలు అన్న మహాత్మా గాంధీ మాటలను నిజం చేస్తూ సీఎం కేసీఆర్ నాయకత్వంలో ప్రతి పల్లె ప్రగతిలో ఆదర్శంగా నిలుస్తోందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా 14వ రోజు పటాన్చెరువు మండలం రుద్రారం గ్రామంలో ఏర్పాటు చేసిన పల్లె ప్రగతి కార్యక్రమాల్లో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా సిద్ది గణపతి దేవాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన హరితహారం లో పాల్గొని మొక్కలు నాటారు. దేవాలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వాల హయాంలో ప్రతి గ్రామం సమస్యలకు నిలయంగా ఉండేదని అన్నారు. చిత్తడి రోడ్లు, పొంగిన మురికి కాలువలు, కూలిన ఇల్లు, చెప్తా చెదారంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే వారిని తెలిపారు.సీఎం కేసీఆర్ నాయకత్వంలో గ్రామాల పురోభివృద్ధికి ప్రవేశపెట్టిన పల్లె ప్రగతి కీలక మార్పులకు శ్రీకారం చుట్టిందని తెలిపారు.ప్రధానంగా ప్రతి రోజు గ్రామంలో చెత్త సేకరించడం, అంతర్గత మురుగునీటి కాలువల నిర్మాణం, సిసి రోడ్లు, వైకుంఠధామాలు, నర్సరీలు, పల్లె ప్రకృతి వనాలు, క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేసి ప్రజలకు మెరుగైన పరిపాలన అందిస్తున్నామని తెలిపారు.జనాభాకు అనుగుణంగా ప్రతి నెల గ్రామ పంచాయతీలకు నిధులు అందించడంతోపాటు పంచాయతీల ఆర్థిక బలోపేతానికి ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని తెలిపారు.

గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రత పెంపొందించడం మూలంగా ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం లభించడంతోపాటు అంటువ్యాధులను పూర్తిస్థాయిలో తగ్గించడం జరిగిందని తెలిపారు.పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని 40 గ్రామ పంచాయతీలకు జివిఆర్ ఎంటర్ప్రైజెస్ సౌజన్యంతో ట్రాక్టర్లు అందించడం జరిగిందని గుర్తు చేశారు.పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని వివిధ గ్రామపంచాయతీలు జాతీయస్థాయిలో తమ పంచాయతీ అవార్డులు అందుకోవడం సంతోషకరమైన విషయం అన్నారు.గ్రామాల అభివృద్ధికి విశేష కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారుఅనంతరం గ్రామపంచాయతీ పారిశుధ్య కార్మికులను ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమంలో ఎంపీపీ సుష్మా శ్రీ వేణుగోపాల్ రెడ్డి, జెడ్పిటిసి సుప్రజా వెంకట్ రెడ్డి, డి ఆర్ డి ఏ పి డి శ్రీనివాసరావు, గ్రామ సర్పంచ్ సుధీర్ రెడ్డి, ఉప సర్పంచ్ యాదయ్య, ఎంపీటీసీలు రాజు, హరిప్రసాద్ రెడ్డి, ఎంపీడీవో బన్సీలాల్, సీనియర్ నాయకులు దశరథ్ రెడ్డి, వెంకట్ రెడ్డి, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
