మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు:
తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పేద, మధ్యతరగతి విద్యార్థులకు సాంకేతిక విద్యను దూరం చేసే విధంగా ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలను ప్రైవేటీకరణ వైపు నెట్టే విధానాలను అవలంబించడం తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు టి. అర్జున్ అన్నారు. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా పటాన్చెరు పట్టణంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల వద్ద ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా అర్జున్ మాట్లాడుతూ, ప్రభుత్వ పాలిటెక్నిక్ విద్యను పీపీపీ లేదా ప్రైవేటీకరణకు అప్పగించే ఆలోచనను ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. శక్తి స్కీమ్ను రద్దు చేయాలని, జీవో ఎంఎస్ నెంబర్ 97ను రద్దు చేయాలని జీవో కు సంబంధించిన పూర్తి వివరాలను ప్రభుత్వం పారదర్శకంగా బహిర్గతం చేయాలని, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలను యంగ్ ఇండియా యూనివర్సిటీ ( వై ఐ ఎస్ యు)లో విలీనం చేయబోమని స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.ప్రభుత్వ పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న ఎస్ బి టేట్ స్వయంప్రతిపత్తి, పాత్రను కొనసాగించాలని, పాలిటెక్నిక్ అధ్యాపకులు, సిబ్బంది సర్వీస్ నిబంధనలకు తగిన రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు.ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలకు తగినన్ని నిధులు కేటాయించి హాస్టళ్లు, ల్యాబ్లు, వర్క్షాప్లు, తరగతి గదులు మరియు ఇతర మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలని కోరారు. ఎలాంటి ఫీజుల పెంపు లేకుండా ఎస్సీ ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈ డబ్ల్యూ ఎస్ విద్యార్థుల స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్లను యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు.పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా కరికులమ్లో మార్పులు చేసినప్పటికీ విద్యార్థుల అకాడమిక్ ప్రమాణాలు, ఉన్నత విద్యకు వెళ్లే అవకాశాలు దెబ్బతినకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవటంతో పాటు విద్యార్థులు, అధ్యాపక సంఘాలతో చర్చించకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటే రాబోయే రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలను మరింత తీవ్రతరం చేస్తామని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు, విశాల్, సాయి, రమేష్, పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.
