అబద్ధపు కేసుల తీరుతెన్నులపై సదస్సు

Telangana

రెండు రోజుల సమావేశాన్ని నిర్వహించిన గీతం కౌటిల్యా స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు:

అబద్ధపు కేసుల తీరుతెన్నులను పరిశీలించి, తగిన మార్గదర్శనం చేసేందుకు గాను హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన కౌటిల్యా స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ (కె.ఎస్.పి.పి.) ఆగస్టు 21-22 తేదీలలో రెండు రోజుల జాతీయ సదస్సును నిర్వహించింది. యుగాంతర్, ఇంటర్నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐ ఐటీ) హైదరాబాద్, భూమిక ఉమెన్స్ కలెక్టివ్ సంయుక్త సహకారంతో నిర్వహించిన ఈ సదస్సులో భారతీయ మహిళా హక్కుల న్యాయవాది, కార్యకర్త, రచయిత్రి, మజ్లిస్ (MAJLIS) సహ వ్యవస్థాపకురాలు ఫ్లావియా ఆగ్నెస్ కీలకోపన్యాసం చేశారు. న్యాయ, న్యాయవాద రంగాలలో తనకున్న విస్తృత అనుభవాన్ని ఉపయోగించి, ఆమె ముఖ్యంగా గృహ హింస, లింగ సమానత్వం వంటి రంగాలలో తప్పుడు కేసుల భావన చుట్టూ ఉన్న ఆందోళనలను ప్రముఖంగా ప్రస్తావించారు.ఈ సదస్సులో తప్పుడు కేసుల ఆరోపణల చుట్టూ ఉన్న సంక్లిష్టతలను, న్యాయ, దర్యాప్తు ప్రక్రియలపై వాటి ప్రభావాన్ని పరిశీలించే పరిశోధన పత్రాలను సమర్పించారు.

ఇందులో భాగంగా, ‘చట్టపరమైన కేసులు, న్యాయ ప్రక్రియలు’, ‘మహిళల ఫిర్యాదులు, దర్యాప్తు ప్రక్రియలు’, ‘ప్రజా చర్చలో తప్పుడు కేసులు’ వంటి అంశాలను చర్చించారు. వివాహ చట్టం, పోక్సో (POCSO) కేసులు, మానవ అక్రమ రవాణా, లైంగిక వేధింపులు, అత్యాచార కేసులు, అఘాయిత్యాల నివారణ చట్టం, గృహ హింస చట్టాలలో తప్పుడు కేసుల సమాచారం, కథనాలను పరిశీలిస్తూ పరిశోధకులు పత్రాలను విశదీకరించారు.ఈ సదస్సులో ‘అన్నింటినీ అనుసంధానించడం: పోలీసు ఫిర్యాదుల అనుభావికత’, ‘తప్పుడు కేసుల చర్చ’ అనే అంశాలపై ప్యానెల్ చర్చలు కూడా జరిగాయి. ఈ సమస్య చట్టపరమైన, సామాజిక కోణాలను చర్చించడానికి న్యాయవాదులు, పరిశోధకులు, పాత్రికేయులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జస్టిస్ ముక్తా గుప్తా, వసుధా నాగరాజ్ తో జరిపిన సంభాషణతో కూడిన ఒక ప్రత్యేక సమావేశం ఈ చర్చలను మరింత సుసంపన్నం చేసింది. జస్టిస్ గుప్తా తన అనుభవం, నైపుణ్యాన్ని ఉపయోగించి ఈ సమస్యలపై న్యాయపరమైన దృక్పథాన్ని పంచుకున్నారు.

ఈ కార్యక్రమంలో ‘ఎ నైట్ ఆఫ్ ఫెమినిస్ట్ షార్ట్ ప్లేస్’తో పాటు ‘విక్రమ్-బేతాల్’ అనే సాంస్కృతిక ప్రదర్శ నలు కూడా ఉన్నాయి. ఇవి లింగం, చట్టం, సమాజంపై ఒక సృజనాత్మక దృక్పథాన్ని అందించి, ఆలోచింపజేశాయి.తొలుత, కె.ఎస్.పి.పి.కి చెందిన డాక్టర్ వసుధా కట్జు స్వాగతోపన్యాసం చేయగా, భారత పూర్వ రాయబారి, కె.ఎస్.పి.పి. డీన్ సయ్యద్ అక్బరుద్దీన్ ప్రారంభోపన్యాసం చేశారు. కె.ఎస్.పి.పి.కి చెందిన గాయత్రి కెఝెవత్ వందన సమర్పణ చేశారు.ఈ సదస్సు విద్యావేత్తలు, న్యాయవాదులు, పరిశోధకులు, కార్యకర్తలు, విద్యార్థులను ఒకచోట చేర్చి, తప్పుడు కేసులు అనే భావనను, చట్టంలోనూ, ప్రజా చర్చలలోనూ అటువంటి కథనాలు ఏవిధంగా ప్రచారంలో ఉన్నాయి, వాటిని ఎలా అర్థం చేసుకుంటున్నారు అనే అంశాలను విమర్శనాత్మకంగా పరిశీలించడానికి ఒక అంతర్-విభాగ వేదికను అందించింది. ఈ సమావేశం విలువైన అంతర్దృష్టులను అందించింనందుకు, అలాగే సంభాషణ, అభ్యసనానికి అవకాశాన్ని కల్పించినందుకు ఇందులో పాల్గొన్నవారు ప్రశంసించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *