మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు:
హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ లోని, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగం పరిశోధక విద్యార్థి కోక విజయ్ డాక్టరేట్ కు అర్హత సాధించారు. ‘స్మార్ట్ ఫోన్లలో ఇన్ స్టాలేషన్ అనంతర సైబర్ దాడులను గుర్తించి, వాటి ప్రభావాన్ని తగ్గించే అనుకూల వ్యవస్థ’పై ఆయన అధ్యయనం చేసి, సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించారు.ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న కంప్యూటర్ సైన్స్ అండ్ సిస్టమ్స్ ఇంజనీరింగ్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం. కిరీట్ ముప్పవరం బుధవారం విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ సిద్ధాంత వ్యాసం, అప్లికేషన్ ఇన్ స్టాలేషన్ తరువాత తలెత్తే కొత్త ముప్పుల నుంచి ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ భద్రతను బలోపేతం చేయడంపై దృష్టి సారిస్తుందని తెలియజేశారు.
ఈ పరిశోధన, నకిలీ అప్లికేషన్లు, మ్యాన్-ఇన్-ది-డిస్క్ దాడులు, రీప్యాకేజింగ్, ప్రివిలేజ్ ఎస్కలేషన్, యూఐ స్పూఫింగ్ వంటి ముప్పులను నిజ సమయంలో గుర్తించడానికి, ప్రవర్తనా పర్యవేక్షణ, మెషిల్ లెర్నింగ్, రిస్క్-ఆధారిత ప్రతిస్పందన యంత్రాంగాలను మిళితం చేసే ఒక అనుకూల భద్రతా ఫ్రేమ్ వర్కును అభివృద్ధి చేసిందన్నారు. ప్రతిపాదిత పద్ధతులు నకిలీ-యాప్ గుర్తింపులో 95.83 శాతం ఖచ్చితత్వాన్ని, MitD దాడి గుర్తింపులో 97.33 శాతం ఖచ్చితత్వాన్ని సాధించగా, డైనమిక్ సెక్యూరిటీ అసెస్ మెంట్ ఫ్రేమ్ వర్కు 94.7 శాతం గుర్తింపు ఖచ్చితత్వాన్ని నమోదు చేసి, ఇన్ స్టాలేషన్ తరువాత జరిగే విజయవంతమైన దాడులను గణనీయంగా తగ్గించినట్టు వివరించారు.ఈ పరిశోధనను బెంచ్ మార్క్ డేటాసెట్లను ఉపయోగించి ధృవీకరించారని, ఇది కనిష్ట వనరుల వినియోగంతో మెరుగైన దాడి నివారణను ప్రదర్శించి, వనరుల కొరత ఉన్న స్మార్ట్ ఫోన్లలో ఆచరణాత్మక వినియోగానికి దాని సామర్థ్యాన్ని ప్రస్ఫుటీకరిస్తోందన్నారు.
డాక్టర్ విజయ్ సిద్ధాంత వ్యాసం పీహెచ్.డీ. పట్టాకు అర్హత సాధించడం పట్ల గీతం హైదరాబాదు అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు, గీతం రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, కంప్యూటర్ సైన్స్ అండ్ సిస్టమ్స్ ఇంజనీరింగ్ విభాగాధిపతి డాక్టర ఎస్.మహబూబ్ బాషా, పలు విభాగాల అధిపతులు, అధ్యాపకులు, సిబ్బంది తదితరులు అభినందించినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
