పటాన్‌చెరులో ఘనంగా గూడెం విష్ణువర్ధన్ రెడ్డి జయంతి వేడుకలు

politics Telangana

250 మందికి పైగా యువకుల రక్తదానం ఉచిత వైద్య శిబిరం, అన్నదానం, రోగులకు పండ్ల పంపిణీ

భారీ సంఖ్యలో పాల్గొన్న జిఎంఆర్, జివిఆర్ యువసేన సభ్యులు

గూడెం విష్ణువర్ధన్ రెడ్డి సేవలను స్మరించుకున్న నాయకులు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు:

పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి పెద్ద కుమారుడు కీర్తిశేషులు గూడెం విష్ణువర్ధన్ రెడ్డి 37వ జయంతి వేడుకలను జిఎంఆర్, జివిఆర్ అభిమానులు, స్నేహితులు ఘనంగా నిర్వహించారు. సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ విష్ణువర్ధన్ రెడ్డి జ్ఞాపకాలను స్మరించుకున్నారు.జయంతి సందర్భంగా పటాన్‌చెరు పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో జిఎంఆర్ యువసేన, జివిఆర్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భారీ రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో 250 మందికి పైగా యువకులు రక్తదానం చేసి తమ మానవతా దృక్పథాన్ని చాటుకున్నారు. రక్తదాన శిబిరాన్ని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి ఆర్ఎంఓ శ్రీనివాస్ పర్యవేక్షించారు.అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు పండ్లు పంపిణీ చేశారు. నిరుపేద ప్రజలకు అన్నదానం నిర్వహించారు. బ్లాక్ ఆఫీస్ షాపింగ్ కాంప్లెక్స్ ఆవరణలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి పలువురికి వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన వైద్య సలహాలు అందించారు.అనంతరం అభిమానులు, సన్నిహితులు, యువసేన సభ్యుల సమక్షంలో కేక్ కట్ చేసి గూడెం విష్ణువర్ధన్ రెడ్డి జయంతి వేడుకలను నిర్వహించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పలువురు నాయకులు మాట్లాడుతూ గూడెం విష్ణువర్ధన్ రెడ్డి తండ్రికి తగ్గ తనయుడిగా ఎదుగుతున్న క్రమంలో అకాల మరణం చెందడం అత్యంత బాధాకరమని అన్నారు. ప్రజా సేవ పట్ల ఆయనకున్న ఆసక్తి, స్నేహశీలత, సేవా భావం అందరికీ ఆదర్శమని పేర్కొన్నారు. విష్ణువర్ధన్ రెడ్డి ఆశయాలు, ఆదర్శాలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఆయన జ్ఞాపకార్థం నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు సమాజానికి ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి, యాదగిరి యాదవ్, విజయ్ కుమార్, నర్రా బిక్షపతి, రామచంద్రారెడ్డి, పృథ్వీరాజ్, గూడెం సంతోష్ రెడ్డి, గూడెం సందీప్ రెడ్డి, అశోక్, వెంకటేష్, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *