చిట్కుల్ లో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

politics Telangana

అసమానతల నిర్మూలనే అసలైన స్వేచ్ఛ

బడుగులకు న్యాయం కాంగ్రెస్ తోనే సాధ్యం

మహనీయుల ఆశయాలకు అనుగుణంగా రేవంత్ పాలన.. నీలం మధు ముదిరాజ్ 

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు:

దేశంలో ఆర్థిక, సామాజిక, రాజకీయ అసమానతలు పూర్తిగా తొలగిపోయినప్పుడే భారత్ నిజమైన ప్రగతి బాటలో పయనిస్తుందని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి నీలం మధు ముదిరాజ్ తెలిపారు. శనివారం స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని చిట్కుల్‌లోని ఎస్సీ కాలనీ, మాల బస్తి, అంగన్వాడి కేంద్రం, దుర్గమ్మ గుడి సమీపం, ముదిరాజ్ కాలనీ, గొల్ల కురుమ యాదవ సంఘం, వార్డు కార్యాలయం, పల్లె దవకాన, చాకలి ఐలమ్మ విగ్రహం వద్ద, పలు కాలనీలలోని జాతీయ జెండా ఆవిష్కరణ వేడుకల్లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని, స్థానిక ఎన్.ఎం.ఆర్ క్యాంపు కార్యాలయంలో మువ్వన్నెల జెండాను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా నీలం మధు మాట్లాడుతూ, వలస పాలన నుంచి దేశానికి స్వేచ్ఛను సాధించిపెట్టిన కాంగ్రెస్ పార్టీ, నేడు బడుగు, బలహీన వర్గాల ఆర్థిక వికాసానికి, సామాజిక భద్రతకు ప్రాధాన్యమిస్తూ పాలన సాగిస్తోందని కొనియాడారు. సామాజిక అసమానతలను రూపుమాపేందుకు విద్యా, వైద్య, ఉపాధి రంగాల్లో ప్రభుత్వం విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిందని ఆయన వివరించారు. బడుగు వర్గాల పిల్లలకు నాణ్యమైన విద్యనందించేందుకు ప్రతి నియోజకవర్గంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలలను నెలకొల్పడంతో పాటు స్కిల్ డెవలప్‌మెంట్ కేంద్రాల ద్వారా యువతకు సాంకేతిక నైపుణ్య శిక్షణ అందిస్తున్నారని పేర్కొన్నారు.తెల్ల రేషన్ కార్డు కలిగిన కుటుంబాలకు ‘మహాలక్ష్మి’ పథకం ద్వారా రూ. 500 కే గ్యాస్ సిలిండర్, ‘గృహ జ్యోతి’ కింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్ , ‘రాజీవ్ ఆరోగ్యశ్రీ’ ఉచిత వైద్య పరిమితిని రూ. 10 లక్షలకు పెంచడం ద్వారా ప్రతీ పేద కుటుంబానికి కొండంత అభయం లభించిందని తెలిపారు.

నేడు సంగారెడ్డి కేంద్రంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నూతన డిజిటల్ రేషన్ కార్డులను ప్రవేశపెట్టనున్నారనిఈ రేషన్ కార్డుల ద్వారా సంక్షేమ ఫలాలు నేరుగా అర్హులకు అందుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే ‘రాజీవ్ యువ వికాసం’ ద్వారా యువత స్వయం ఉపాధి సాధించడానికి రుణాలు, రాయితీలు లభిస్తున్నాయని వివరించారు. మహనీయులు కలలు కనిన సమానత్వ ప్రాతిపదికన, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతోందని, సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకుంటూ ప్రతి ఒక్కరూ ఆర్థికంగా ఎదగడమే నాటి స్వాతంత్ర్య పోరాట యోధులకు ఇచ్చే నిజమైన నివాళి అని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *