22A నిషేధిత భూముల బాధితులకు అండగా బీఆర్‌ఎస్‌ పోరాటం

politics Telangana

కాంగ్రెస్ ప్రభుత్వం వెనక్కి తగ్గే వరకు అవిశ్రాంత పోరాటం

నిరసన గళం సభను విజయవంతం చేయండి.

ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు:

22A నిషేధిత భూముల జాబితాలో చేర్చిన భూముల బాధితులకు అండగా బీఆర్‌ఎస్‌ పార్టీ ఆధ్వర్యంలో శనివారం పటాన్‌చెరు కేంద్రంగా నిర్వహించనున్న నిరసన గళం సభను దిగ్విజయవంతం చేయాలని పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి పిలుపునిచ్చారు. 22A భూముల సమస్యపై బాధితుల పక్షాన నిలిచి, వారి హక్కుల పరిరక్షణ కోసం నిరంతరం పోరాడుతామని ఆయన స్పష్టం చేశారు.నిరసన కార్యక్రమం ఏర్పాట్లపై శుక్రవారం జిన్నారం, గుమ్మడిదల, పటాన్‌చెరు మండలాలు, మున్సిపాలిటీలకు చెందిన బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులతో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సభను విజయవంతం చేసేందుకు చేపట్టాల్సిన ఏర్పాట్లు, నాయకులు, కార్యకర్తలు, 22A భూముల బాధితులను పెద్ద సంఖ్యలో తరలించే అంశాలపై చర్చించారు.

ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ రియల్ ఎస్టేట్ రంగంలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న పటాన్‌చెరు నియోజకవర్గంలో ఎలాంటి వివాదాలు లేని ప్రైవేట్, పట్టా భూములు, రిజిస్టర్డ్ ఇళ్లను సైతం 22A నిషేధిత జాబితాలో చేర్చడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.22A జాబితాలో భూములు చేరడంతో ఆస్తులను విక్రయించుకోలేక, బ్యాంకు రుణాలు పొందలేక, తమ అవసరాలకు ఆస్తులను వినియోగించుకోలేక ప్రజలు ఆర్థికంగా, మానసికంగా ఇబ్బందులు పడుతున్నారని ఆయన పేర్కొన్నారు.

బాధితుల సమస్యను అడ్డుపెట్టుకుని దళారుల దందా

22A జాబితా నుంచి పేర్లు తొలగించిస్తామంటూ కొంతమంది బ్రోకర్లు, దళారులు బాధితులను లక్ష్యంగా చేసుకుని అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని ఎమ్మెల్యే ఆరోపించారు. 30 శాతం వరకు కమీషన్లు డిమాండ్ చేస్తూ దందాలకు పాల్పడుతున్న వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించాల్సిన ప్రభుత్వం వారి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని, నిషేధిత జాబితాలో చేర్చిన భూముల విషయంలో పారదర్శకంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు.

వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు

22A నిషేధిత భూముల బాధితులకు న్యాయం జరిగే వరకు బీఆర్‌ఎస్‌ పార్టీ వారి పక్షాన నిలబడుతుందని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం 22A భూముల సమస్యపై సరైన పరిష్కారం చూపే వరకు అవిశ్రాంతంగా పోరాటం కొనసాగిస్తామని ఆయన పేర్కొన్నారు.పటాన్‌చెరులోని జిఎంఆర్ ఫంక్షన్ హాల్‌లో శనివారం సాయంత్రం 4 గంటలకు నిర్వహించనున్న నిరసన కార్యక్రమానికి రాష్ట్ర మాజీ మంత్రివర్యులు శ్రీ తన్నీరు హరీష్ రావు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారని ఎమ్మెల్యే తెలిపారు.నియోజకవర్గంలోని బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ముఖ్యంగా 22A నిషేధిత భూముల బాధితులు భారీ సంఖ్యలో తరలివచ్చి నిరసన గళాన్ని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *