అమ్మవారి దేవాలయాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు..
మనవార్తలు ప్రతినిధి,రామచంద్రాపురం:
ఆషాఢమాసాన్ని పురస్కరించుకొని ఆదివారం రామచంద్రాపురం డివిజన్ పరిధిలోని వివిధ కాలనీలలో నిర్వహించిన బోనాల ఉత్సవాల్లో పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అమ్మవారి దేవాలయాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజల సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, పాడిపంటలు సమృద్ధిగా ఉండాలని అమ్మవారిని ప్రార్థించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు బోనాల పండుగ ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. ఆషాఢమాసంలో అమ్మవారిని భక్తిశ్రద్ధలతో కొలవడం అనాదిగా వస్తున్న సంప్రదాయమని పేర్కొన్నారు. బోనాల పండుగ సందర్భంగా ప్రజలంతా ఐక్యంగా, భక్తిశ్రద్ధలతో ఉత్సవాలను నిర్వహించడం అభినందనీయమన్నారు.
అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను భవిష్యత్ తరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు, ప్రజా ప్రతినిధులు, ఉత్సవ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే జిఎంఆర్ ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమాల్లో మాజీ ప్రజా ప్రతినిధులు, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మహిళలు, యువకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
