జర్నలిస్టుల ఐక్యతతోనే హక్కుల సాధన సాధ్యం
అధ్యక్షులుగా బాదిని శ్రీనివాస్ – ప్రధాన కార్యదర్శిగా కొత్తకొండ సత్యం ఎన్నిక
పాత్రికేయుల సమస్యల పరిష్కారానికి సంఘటిత పోరాటమే మార్గం: ఎల్గోయి ప్రభాకర్, సీలంకోటి సురేందర్
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు:
తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ (టిడబ్ల్యూజేఎఫ్) పటాన్చెరు డివిజన్ 3వ కాన్ఫరెన్స్ పటాన్చెరు పట్టణంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్లో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డివిజన్ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా బాదిని శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా కొత్తకొండ సత్యం ఎన్నికయ్యారు. నూతన కమిటీ సభ్యులకు జిల్లా నాయకులు అభినందనలు తెలియజేస్తూ శుభాకాంక్షలు అందించారు.ఈ సమావేశానికి టిడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్షులు ఎల్గోయి ప్రభాకర్, జిల్లా ప్రధాన కార్యదర్శి సీలంకోటి సురేందర్ ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడుతూ, జర్నలిస్టుల హక్కుల పరిరక్షణ, సంక్షేమం, వృత్తి గౌరవం కోసం టిడబ్ల్యూజేఎఫ్ రాష్ట్రవ్యాప్తంగా నిరంతరం పోరాటం చేస్తోందన్నారు. జర్నలిస్టుల మధ్య ఐక్యత పెరిగితేనే వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమర్థవంతంగా పరిష్కరించుకోవచ్చని పేర్కొన్నారు.అర్హులైన ప్రతి పాత్రికేయుడికి అక్రిడిటేషన్ కార్డులు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, జర్నలిస్టుల సంక్షేమ నిధిని బలోపేతం చేయాలని, ఆరోగ్య బీమా, ప్రమాద బీమా, గృహ స్థలాలు, పెన్షన్ వంటి సంక్షేమ కార్యక్రమాలను మరింత విస్తరించాలని ప్రభుత్వాన్ని కోరారు.
గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న విలేకరులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారి సమస్యలను సంఘం తరఫున సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం కృషి చేస్తామని తెలిపారు.నేటి పరిస్థితుల్లో జర్నలిజం అనేక సవాళ్లను ఎదుర్కొంటోందని, అలాంటి సమయంలో పాత్రికేయులు వాస్తవాలను నిర్భయంగా ప్రజలకు చేరవేయాలని సూచించారు. వార్తల సేకరణలో నైతిక విలువలు, వృత్తి ప్రమాణాలు పాటిస్తూ ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలని కోరారు. యువ జర్నలిస్టులు అనుభవజ్ఞుల నుంచి నేర్చుకుంటూ వృత్తిలో ఉన్నత స్థాయికి చేరాలని ఆకాంక్షించారు.అనంతరం నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడు బాదిని శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి కొత్తకొండ సత్యం మాట్లాడుతూ, తమపై ఉంచిన నమ్మకానికి సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. డివిజన్లోని ప్రతి జర్నలిస్టుకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారం కోసం జిల్లా, రాష్ట్ర నాయకత్వంతో సమన్వయం చేసుకుంటూ పనిచేస్తామని హామీ ఇచ్చారు.
సభ్యత్వ నమోదు, సంఘం బలోపేతం, శిక్షణ కార్యక్రమాలు, జర్నలిస్టుల సంక్షేమానికి ప్రత్యేక కార్యాచరణ చేపడతామని వెల్లడించారు.ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులను జిల్లా నాయకులు శాలువాలతో ఘనంగా సత్కరించారు. సమావేశంలో పలు తీర్మానాలను ఆమోదించి, జర్నలిస్టుల హక్కుల సాధన కోసం సంఘటితంగా పనిచేయాలని నిర్ణయించారు.ఈ కార్యక్రమంలో జాతీయ కౌన్సిల్ మెంబర్ సుదర్శన్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేకల కృష్ణ, పాండు, రామకృష్ణ, వాసుదేవ్, జిల్లా నాయకులు, డివిజన్ నాయకులు, సీనియర్ జర్నలిస్టులు, వివిధ పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియా, డిజిటల్ మీడియా ప్రతినిధులు, పెద్ద సంఖ్యలో జర్నలిస్టులు పాల్గొన్నారు. సమావేశం ఉత్సాహభరితంగా కొనసాగింది.
