మార్పును అందిపుచ్చుకోవాలి

Telangana

టెడ్ఎక్స్ వక్తల సూచన 

గీతంలో విజయవంతంగా ముగిసిన టెడ్ఎక్స్ గీతం హైదరాబాద్-2025

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

మార్పు అనివార్యమని, దానిని అందిపుచ్చుకుని వర్తమాన పరిస్థితులకు అనుగుణంగా భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని టెడ్ఎక్స్ వక్తలు సూచించారు. హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో డైరెక్టరేట్ ఆఫ్ స్టూడెంట్ లైఫ్ ఆధ్వర్యంలో ‘టెడ్ఎక్స్ గీతం హైదరాబాద్-2025’ని గురువారం విజయవంతంగా నిర్వహించారు. విభిన్న రంగాల నుంచి విచ్చేసిన, అత్యంత విశిష్ట అతిథులు మార్పు గురించి స్ఫూర్తిదాయకమైన ప్రసంగాలు చేశారు. ఈ కార్యక్రమంలో నాయకత్వం, విద్య, పాలన, మీడియా, ఆర్థిక శాస్త్రం, భావోద్వేగ మేధస్సుపై లోతైన అవగాహనను వక్తలు కల్పించి, ఆహూతులలో అర్థవంతమైన చర్చను లేవనెత్తారు.కేంద్ర మానవ వనరుల అభివృద్ధి, రక్షణ శాఖల మాజీమంత్రి ఎం.ఎం.పల్లంరాజు టెడ్ టాక్స్ ను ప్రారంభిస్తూ, చిన్న వయస్సులోనే పిల్లలను స్వయం సమృద్ధం చేయాలని, పాఠశాల విద్య నాణ్యతను పెంచాలని, నైతిక విలువలు, నీతి, పర్యావరణ స్పృహను పాఠ్యాంశాలలో చేర్చాల్సిన తక్షణ ఆవశ్యకతపై ఆయన ఆకర్షణీయమైన ప్రసంగం చేశారు.

విద్యారంగం, పరిశ్రమ మధ్య అంతరాన్ని తగ్గించడం, ప్రభుత్వం, ఆర్థిక సంస్థలు, వ్యవస్థాపకుల మధ్య చురుకైన భాగస్వామ్యాలను పెంపొందించడం తప్పనిసరని ఆయన పేర్కొన్నారు. మేధో సంపత్తి, ఆవిష్కరణలలో భారతదేశాన్ని అగ్రగామిగా నిలబెట్టడానికి పరిశోధనా పెట్టుబడులను గణనీయంగా పెంచాల్సిన ప్రాముఖ్యతను పల్లంరాజు నొక్కి చెప్పారు.న్యూస్ మొబైల్ వ్యవస్థాపకుడు, ఎడిటర్-ఇన్-చీఫ్, ప్రఖ్యాత పరిశోధనాత్మక జర్నలిస్టు, గ్లోబల్ ఫ్యాక్ట్ చెకర్ సౌరభ్ శుక్లా మాట్లాడుతూ, డిజిటల్ యుగంలో జర్నలిజం అభివృద్ధి చెందుతున్న అంశాన్ని ప్రస్తావించారు. సంచలనాత్మకత కంటే వాస్తవ ఖచ్చితత్వానికి ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన గీతం విద్యార్థులకు సూచించారు. బాధ్యతాయుతమైన జర్నలిజాన్ని రూపొందించడంలో చారిత్రక అవగాహన పాత్రను సౌరబ్ నొక్కి చెప్పారు.

ప్రఖ్యాత సెలబ్రిటీ యాంకర్, జర్నలిస్టు, కవయిత్రి, చలనచిత్ర విమర్శకురాలు అతికా ఫరూఖీ మాట్లాడుతూ, సినిమా సమాజంపై చూపే ప్రభావాన్ని, అది అందించే శక్తివంతమైన సందేశాలను వివిధ చిత్రాలను ఉదహరిస్తూ నొక్కి చెప్పారు. సినిమా టికెట్ కొనడం అంటే దానికి అనుకూలంగా ఓటు వేయడం లాంటిదని, చలన చిత్రాలను ప్రేక్షకులు శ్రద్ధగా చూడాలని, వినాలని సూచించారు. ఆలోచనా రహిత, బాధ్యతా రహిత చిత్రాలను తిరస్కరించాలని అతికా సూచించారు. ప్రజల అవగాహనను రూపొందించడంలో, సామాజిక మార్పును ప్రభావితం చేయడంలో మీడియా యొక్క పరివర్తన శక్తి గురించి ఆమె వివరించారు.ప్రముఖ ఆర్థికవేత్త, భారత 13వ ఆర్థిక కమిషన్ పూర్వ సలహాదారు డాక్టర్ రతిన్ రాయ్, జాతీయ పురోగతిని నడిపించడానికి ఆర్థిక పరివర్తన, స్థిరమైన వృద్ధి, వ్యూహాత్మక విధాన రూపకల్పనపై విలువైన అవగాహనను కల్పించారు.

ది లెర్నింగ్ కర్వ్ ఫౌండేషన్ సహ వ్యవస్థాపకుడు, ముఖ్య కార్యనిర్వహణాధికారి సుబ్బు పరమేశ్వరన్ మాట్లాడుతూ, నిజమైన ఆవిష్కరణ అందుబాటులో ఉన్న వనరులను సమర్థంగా ఉపయోగించడంలో ఉందని, అర్థవంతమైన మార్పును సృష్టించాలనే నిజాయితీ గల ఉద్దేశ్యంతో నడపబడుతుందని చెప్పారు. చిన్న ఆవిష్కరణలు కూడా గణనీయమైన ప్రభావానికి దారితీస్తాయని, పరిమితులకు అనుగుణంగా ఉండటం అన్ని ఆవిష్కరణల యొక్క ఆత్మగా ఆయన అభివర్ణించారు.ఈ కార్యక్రమాన్ని విద్యార్థులు జాగ్రత్తగా సమన్వయం చేస్తూ, వక్తలు, ఇందు పాల్గొన్నవారికి సజావుగా, ప్రభావంతమైన అనుభవాన్ని అందించడానికి తోడ్పడ్డారు. ఈ టెడ్ఎక్స్ దార్శినిక నాయకులకు కొత్త ఆలోచనలను పంచుకోవడానికి, తదుపరి తరానికి స్ఫూర్తినిచ్చేందుకు, ఆయా విభాగాలలో అర్థవంతమైన మార్పును తీసుకురావడానికి తోడ్పడే అర్థవంతమైన వేదికగా నిలిచింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *