మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు:
ఆర్కిటెక్చర్ విద్య, కెరీర్ అవకాశాల గురించి ఇంటర్మీడియెట్ విద్యార్థులకు సమగ్ర అవగాహన కల్పించే లక్ష్యంతో, హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ (జీఎస్ఏ) డిసెంబర్ 2025 నుంచి జనవరి 2026 వరకు పలు ఔట్ రీచ్ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించింది.మదీనగూడలోని జెన్ సిస్ ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థులతో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో ఆర్కిటెక్చరల్ మోడల్స్, డ్రాయింగులు, ముఖాముఖి ప్రదర్శనలను ఏర్పాటు చేశారు. అలాగే ఆచరణాత్మక, సృజనాత్మక అన్వేషణను ప్రోత్సహించే మందల ఆర్ట్ వర్కుషాపును కూడా నిర్వహించారు. మొత్తం 168 మంది జెన్ సిస్ విద్యార్థులు, ఎనిమిది మంది ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఆ తరువాత, శ్రీ స్వామినారాయణ గురుకుల్ నుంచి దాదాపు 250 మంది విద్యార్థులు, శ్రీ చైతన్య బాలురు (వివిధ సెషన్లలో 300, 500, 300 మంది), బాలికల (855 మంది) కోసం వరుస ఔట్ రీచ్ కార్యక్రమాలను నిర్వహించారు. విద్యార్థులకు విశ్వవిద్యాలయ ప్రాంగణ అభవాలను, ఆర్కిటెక్చర్ విద్యపై ఆచరణాత్మక అవగాహనను, డిజైన్ ఆలోచనను పెంపొందించడంతో పాటు విభిన్న కెరీర్ అవకాశాల గురించి వివరించారు.ఈ కార్యక్రమాలన్నింటినీ గీతం ఆర్కిటెక్చర్ అధ్యాపకులు ఆర్.అభిషేక్ కుమార్ సింగ్, ఆర్.స్నిగ్ధరాయ్ సమన్వయం చేశారు. ఇవన్నీ గీతం స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ యొక్క విద్యాపరమైన అవగాహన, కెరీర్ మార్గదర్శనం పట్ల నిరంతర నిబద్ధతను ప్రతిబింబిస్తున్నాయనడంలో అతిశయోక్తి లేదు.
