రైతులు సాగు చేస్తున్న పంట భూములను సిపిఎం పార్టీ బృందం
తహసిల్దార్ కు వినతిపత్రం అందజేత
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు:
లక్డారం గ్రామ దళితుల భూములకు భూమికి భూమి లేదా, తగిన నష్టపరిహారం చెల్లించేలా జిల్లా అధికార యంత్రాంగం చర్యలు చేపట్టాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి జి జయరాజ్ సంబంధిత అధికారులను డిమాండ్ చేశారు. బుధవారం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మండలంలోని లక్డారం గ్రామ దళితుల భూముల్లో అక్రమంగా ఎస్ టి పి ప్లాంట్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ రైతులు సాగు చేస్తున్న పంట భూములను సిపిఎం పార్టీ బృందం పరిశీలించడం జరిగింది. అనంతరం పటాన్ చెరు తహసిల్దార్ హరిబాబుకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి జి జయరాజు మాట్లాడుతూ లక్డారం గ్రామంలో సర్వేనెంబర్ 498 లో 1970లో అప్పటి ప్రభుత్వం గ్రామంలోని 25 మంది కుటుంబాలకు ఎకరం చొప్పున 23 ఎకరాలను కేటాయించిందని అన్నారు. అప్పటినుండి ఇప్పటివరకు గ్రామ రైతులు వరి పంట పండించుకుంటూ జీవనం సాగిస్తున్నారన్నారు. గ్రామ రైతులకు ఈ భూములు తప్ప ఎలాంటి జీవనాధారం లేవని చెప్పారు.

2015 వ సంవత్సరం నుండి అప్పటి అధికారులు ఈ భూములను కారిజ్ ఖాతా భూములుగా పేర్కొంటూ, మీకు ఎలాంటి హక్కులు లేవని పేర్కొంటూ ఎస్ టి పి ప్లాంట్ ఏర్పాటు కోసము సీఎంఓ కార్యాలయం నుంచి ఆదేశాలు ఉన్నాయని పది ఎకరాలను కేటాయిస్తున్నట్లుగా అధికారులు చూపెడుతున్నారని, గత మూడు రోజులుగా లక్డారం గ్రామంలో పోలీసు పహరా మధ్య పది ఎకరాల చుట్టూ ఫెన్సింగ్ వేయడానికి నాలుగు జెసిబి లతో ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఎస్ టి పి ప్లాంట్ ఏర్పాటు చేస్తే గ్రామంలో గ్రామ ప్రజల ప్రజాభిప్రాయ సేకరణను ఎందుకు నిర్వహించలేదని ప్రశ్నించారు. గ్రామ రైతుల భూములను ఒకవేళ తీసుకుంటే నోటీసులు ఇవ్వకుండా,ఎలాంటి నష్టపరిహారం చెల్లించకుండా రైతు వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. అనేక భూములు అన్యక్రాంతమవుతున్న భూములను తీసుకోకుండా కేవలం దళితుల భూములను మాత్రమే ఎలా తీసుకుంటా రని పని ప్రశ్నించారు. ఎస్ టి పి ప్లాంట్ ఏర్పాటు చేస్తే లక్డారం, చిట్కుల్, రుద్రారం, బేగంపేట, చిదురుప్ప చుట్టుపక్క గ్రామాల నీళ్లు, భూములు పూర్తిగా కలుషితమయ్యే అవకాశం ఉంటుందని, నక్క వాగులోకి కలుషిత జలాలు వదిలితే మంజీరా నదిలోకి వెళ్లి, సింగూరు నీరు కూడా పూర్తిగా కలుషితం అవుతాయన్నారు.
గతంలో ఎస్ టి పి ప్లాంట్ ఏర్పాటు చేస్తే ఊరుకోమని, అమీన్పూర్ ప్రాంతంలో ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా అక్కడి ప్రజలు తిప్పి కొట్టగలిగారని, ప్రజావ్యతిరేక చర్యలకు పాల్పడితే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. లక్డారం గ్రామ సమస్యను దృష్టిలో ఉంచుకొని భూమికి భూమి లేదా, నష్టపరిహారం చెల్లించేలా జిల్లా అధికార యంత్రం చర్యలు చేపట్టాలని, 2013 భూ సేకరణ చట్టం అంశాలను పరిగణలోకి తీసుకోకుండా జిల్లా అధికార యంత్రాంగం రైతులను పూర్తిగా నష్టం చేసే చర్యలకు పాల్పడుతుందని విమర్శించారు. లక్డారం గ్రామ భూ సమస్యను వెంటనే పరిష్కారం చేసేలా పోలీసుల జోక్యాన్ని నివారించాలని జయరాజ్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం నర్సింలు, సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు బి నాగేశ్వరరావు, సిపిఎం నాయకులు ఎండి వాజిద్ అలీ, సిపిఎం జిల్లా నాయకులు పి అశోక్, కంజర్ల మల్లేశం, కే మాణిక్య ప్రభు, కంచర్ల రవి, కంజర్ల నరసింహులు, భాగయ్య, ఇస్నాపురం మల్లేశం, ఏ రాఘవేందర్,బలరాం, శ్రీనివాస్, ఇతరులు పాల్గొన్నారు.
