పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ, హైదరాబాదులో ఏప్రిల్ 3-4 తేదీలలో పర్యావరణ హిత కృత్రిమ మేధస్సు, పరిశ్రమలలో వినియోగం (గ్రీన్ ఏఐ-2025) పేరిట నిర్వహించిన రెండు రోజుల అంతర్జాతీయ సదస్సు శుక్రవారం విజయవంతంగా ముగిసింది. ఈ సదస్సు ఏఐ రంగంలో జ్జాన మార్పిడి, ఆవిష్కరణ, సహకారం కోసం ఒక వేదికగా తోడ్పడింది. ఈ సదస్సు ఏఐ జనరేటెడ్ మోడల్స్, ఆటోమేటెడ్ లెటర్ జనరేషన్, ఇండస్ట్రియల్ అప్లికేషన్లపై దృష్టి సారించే ముందస్తు కార్యశాలలతో ప్రారంభమైనట్టు సదస్సు నిర్వహకురాలు డాక్టర్ నందిత భంజ చౌధురి వెల్లడించారు. మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్, వెరిజోన్ డేటా సర్వీసెస్ తో సహా ప్రముఖ సంస్థల నుంచి అనేక మంది ప్రముఖ వక్తలు ఆరోగ్య సంరక్షణ, గేమింగ్, ఆర్కిటెక్చరల్ డిజైన్, అంతకు మించి ఏఐ-ఆధారిత ఆవిష్కరణపై సదస్యులకు లోతైన అవగాహన కల్పించినట్టు ఆమె తెలిపారు. గత రెండు రోజులుగా ఈ సదస్సులో పాల్గొన్నవారు అంతర్దృష్టి చర్చలతో పాటు తమ ఆలోచనలను ఇతరులతో పంచుకున్నట్టు చెప్పారు. మేధోపరమైన చర్చ, మార్గదర్శక పురోగతుల కేంద్రంగా ఈ సదస్సు నిరూపితమైందన్నారు. ఏఐ, దాని వినియోగిస్తున్న నిపుణులు కొంతమందిని ఒకచోట చేర్చినట్టు తెలిపారు. వారందరికీ హృదయ పూర్వక కృతజ్జతలను డాక్టర్ నందిత తెలియజేశారు. చివరగా, ఈ సదస్సులో స్వయంగా పత్ర సమర్పణ చేసిన వారికి ప్రశంసా పత్రాలను సీఎస్ఈ (ఏఐ అండ్ ఎంఎల్) విభాగాధిపతి ప్రొఫెసర్ శిరీష, సీఎస్ఈ విభాగాధిపతి ప్రొఫెసర్ షేక్ మహబూబ్ బాషా ప్రదానం చేశారు.