పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ సైన్స్ రీసెర్చ్ (ఐసీఎస్ఎస్ఆర్) సౌజన్యంతో, గీతం స్కూల్ ఆఫ్ బిజినెస్, హైదరాబాద్ లో ఈనెల 4 నుంచి 13వ తేదీ వరకు నిర్వహించిన పది రోజుల రీసెర్చ్ మెథడాలజీ కోర్సు (ఆర్ఎంసీ)ని విజయవంతంగా ముగించినట్టు కోర్సు సహ-డైరెక్టర్ డాక్టర్ మనోజ్ కుమార్ గురువారం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు. ఆధునిక విద్యావసరాలకు సరిపోయే పరిశోధనా నైపుణ్యాలతో స్కాలర్లను సన్నద్ధం చేయడం లక్ష్యంగా దీనిని నిర్వహించామన్నారు. ఈ కోర్సును ఐపీఈ పూర్వ డైరెక్టర్ ప్రొఫెసర్ ఆర్.కె.మిశ్రా ప్రారంభించగా, దేశంలోని పలు విద్యా సంస్థలకు చెందిన విశిష్ట అధ్యాపకులు ప్రొఫెసర్ మహమ్మద్ అబ్దుల్ అజీమ్, ప్రొఫెసర్ రూపేష్ కుమార్, ప్రొఫెసర్ రవికాంత్, ప్రొఫెసర్ నిత్య సుందర్ నందా, ప్రొఫెసర్ జ్యోతిశ్రీ, ప్రొఫెసర్ ఇ.రాజేష్, ప్రొఫెసర్ శివోహం సింగ్, ప్రొఫెసర్ వినోద్ కుమార్, ప్రొఫెసర్ ఎం.పీ.గణేష్, ప్రొఫెసర్ మురుగన్ పట్టుస్వామి తదితరులు పరిశోధన ప్రాథమిక అంశాల నుంచి గుణాత్మక పద్ధతులు, సంక్లిష్ట పరిశోధన, సిద్ధాంత వ్యాస రచన, సాహిత్య సమీక్ష, నమూనా డిజైన్ అంశాలను పరిచయం చేసినట్టు వివరించారు. ఈ కోర్సు ముగింపు కార్యక్రమంలో జీఎస్బీ ఇన్ ఛార్జి డైరెక్టర్ డాక్టర్ దివ్య కీర్తి గుప్తా పాల్గొని, ఉన్నత పరిశోధన, సహకారం, బలమైన పరిశోధన సంస్కృతి ప్రాముఖ్యతను నొక్కి చెప్పినట్టు తెలిపారు. డాక్టర్ కె.ఎన్.రేఖ, డాక్టర్ శోభా మిశ్రా ఈ కోర్సును సమన్వయం చేసినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.