మనవార్తలు ప్రతినిధి,రామచంద్రపురం :
పటాన్ చెరువు నియోజకవర్గం రామచంద్రపురం పట్టణంలోని మహంకాళి అమ్మవారి దేవాలయంలో ఇటీవల చోటుచేసుకున్న దుర్ఘటనపై ఎమ్ ఆర్ పీఎస్ జిల్లా ఇన్చార్జ్ విఎస్ రాజు మాదిగ, ఎమ్ ఎమ్ ఎస్ మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు పెద్ద గీత, ఎమ్ ఆర్ పీఎస్ నాయకులు ఆలయాని సందర్శించి ఘటన జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానికులను కలిసి ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్ ఆర్ పీఎస్ నాయకులు మాట్లాడుతూ తమ జాతీయ నాయకుడు మంద కృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఘటన స్థలాన్ని పరిశీలించి పోలీస్ స్టేషన్కు వెళ్లి ఘటనకు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు ఇక్కడికి వచ్చినట్లు తెలిపారు. ఎసి సామాజిక వర్గానికి చెందిన బాలికపై లైంగిక దాడికి పాల్పడిన నిందితులపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆలయంలో విధులు నిర్వహిస్తున్న పురోహితుడిపై చట్టప్రకారం కఠినమైన శిక్ష విధించాలని వారు కోరారు. బాధిత బాలికకు న్యాయం జరిగే వరకు ఎమ్ ఆర్ పీఎస్ ఆధ్వర్యంలో పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. చిన్నారిపై ఇలాంటి దారుణ ఘటన జరగడం అత్యంత నీచమైన చర్యగా వారు అభివర్ణించారు. బాధిత బాలిక నిందితుడి మనవరాలి వయసులో ఉంటుందని, అయినప్పటికీ ఇలాంటి దారుణానికి పాల్పడటం అమానుషమని ఆవేదన వ్యక్తం చేశారు. బాలికకు న్యాయం జరిగేలా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో వెంకటేష్ , ప్రవీణ్, రమేష్, బందేల రవికుమార్, కృష్ణ, యేసయ్యా, ఎమ్ ఆర్ పీఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
