కేర్ ఎన్ లవ్ అనాథాశ్రమ చిన్నారులతో ఉత్సాహభరితంగా ‘జాయ్ ఆఫ్ గివింగ్’
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
వ్యాపార మేళకువలే కాదు, సామాజిక బాధ్యత కూడా తమ మీద ఉందన్న స్ఫూర్తిని చాటేలా గీతం స్కూల్ ఆఫ్ బిజినెస్, హైదరాబాద్ ఎంబీఏ విద్యార్థులు గురువారం ‘జాయ్ ఆఫ్ గివింగ్’ (ఇవ్వడంలో ఉన్న ఆనందం) కార్యక్రమాన్ని ఉత్సాహభరితంగా నిర్వహించారు. బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని, గాజులరామారంలోని కేర్ ఎన్ లవ్ అనాథాశ్రమానికి చెందిన 44 మంది చిన్నారులు, ఇద్దరు సిబ్బందిని గీతంకు ఆహ్వానించి, రోజంతా వారితో ఆడి పాడుతూ, తమలోని సామాజిక స్పృహ, కరుణలను హృదయపూర్వకంగా ప్రదర్శించారు.అనాథ శరణాలయం వార్డెన్ స్వర్ణలత ఆధ్వర్యంలో చిన్నారులు చిరునవ్వులు చిందించేలా ఆటపాటలు, సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు పలు వినోదాత్మక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. చిన్నారులందరికీ ఎంబీఏ విద్యార్థులు అందమైన బహుమతులను అందించి, తమలో మూర్తీభవించిన దాతృత్వం, దయ స్ఫూర్తిని చాటిచెప్పారు. సామాజిక శ్రేయస్సుకు దోహదపడేలా, ఇందులో పాల్గొన్న వారందరిలో ఆశ, సానుకూల భావాన్ని కలిగించారు.
ఈ కార్యక్రమ ప్రారంభోత్సవంలో గీతం హైదరాబాద్ అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీ.ఎస్. రావు, రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, బీ-స్కూల్ ఇన్ ఛార్జి డైరెక్టర్ డాక్టర్ దివ్య కీర్తి గుప్తా తదితరులు పాల్గొని, ఆహూతులందరిలో ఉత్సాహాన్ని నింపడమే గాక, ఇటువంటి కార్యక్రమాల ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు.ఎంబీఏ ద్వితీయ సంవత్సరం విద్యార్థి పూజ ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనకు చిన్నారుల నుంచి ఉత్సాహభరితమైన స్పందన లభించింది. ఈ కార్యక్రమం జరుపుకోవడానికి ఉద్దేశించిన సృజనాత్మకత, ఆనందానికి ఆమె ప్రదర్శన ఉదాహరణగా నిలిచింది. బీ-స్కూల్ అధ్యాపకులు డాక్టర్ నాగప్రియ, డాక్టర్ శ్రీకాంత్ ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేశారు.
