గీతంలో ఉత్సాహంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

Telangana

ఆకట్టుకున్న కవాతు, సాంస్కృతిక కార్యక్రమాలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు:

గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాదులోని గాంధీజీ విగ్రహం వద్ద 80 స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను శుక్రవారం దేశభక్తితో, ఉత్సాహంగా, ఉద్వేగంతో జరుపుకున్నారు. ఈ వేడుకలు దేశానికి, దాని గొప్ప స్వేచ్ఛా వారసత్వానికి ఉత్సాహభరితమైన నివాళిగా విద్యార్థులు, ఉన్నతాధికారులు,అధ్యాపకులు, సిబ్బందిని ఒకచోట చేర్చాయి.‘వందేమాతరం’ జాతీయ గీతం ఆలపించడంతో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, ‘జన గణ మన’ జాతీయ గీతాన్ని ఆలపించారు. గీతం హైదరాబాదు అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డి.ఎస్. రావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, సభికులను ఉద్దేశించి ప్రసంగించారు.

స్వాతంత్ర్యం తరువాత ఎదుర్కొన్న సవాళ్ల నుంచి భారతదేశం సాధించిన గణనీయమైన పురోగతి, వివిధ రంగాలలో పెరుగుతున్న స్వావలంబన వరకు సాగిన అద్భుతమైన ప్రయాణాన్ని ఆయన ఈ సందర్భంగా వివరించారు. ఆర్థిక స్వాతంత్ర్యం సాధించడం ఒక ముఖ్యమైన జాతీయ లక్ష్యంగా మిగిలి ఉందన్నారు. ఆవిష్కరణలు, పరిశోధనలు, వ్యవస్థాపకత ద్వారా యువతరం తమ వంతు సహకారం అందించాలని ఆయన పిలుపునిచ్చారు. దేశ నిర్మాణాన్ని ముందుకు తీసుకెళ్లి, మరింత బలమైన, ఆర్థికంగా స్వయం సమృద్ధి గల భారతదేశం కోసం కృషిచేయాలని ఆయన విద్యార్థులను కోరారు.ఈ వేడుకలలో క్రమశిక్షణ, అంకితభావం, జాతీయ భావనను ప్రదర్శిస్తూ ఎన్.సి.సి. క్యాడెట్లు, ఎన్.ఎస్.ఎస్. వాలంటీర్లు, విశ్వవిద్యాలయ భద్రతా సిబ్బంది ఒక లాంఛనప్రాయ కవాతు నిర్వహించారు. సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా,కళాకృతి స్టూడెంట్స్ క్లబ్ వారి శాస్త్రీయ నృత్య ప్రదర్శన, భద్రతా సిబ్బంది దేశభక్తి గేయాలకు చేసిన నృత్యాలు ఆహూతులను అలరించి, పండుగ వాతావరణాన్ని మరింత పెంచాయి.వేడుకలలో భాగంగా, విశ్వవిద్యాలయానికి అంకితభావంతో సేవలందించిన భద్రతా సిబ్బందికి ప్రశంసా పత్రాలను అందజేశారు. క్రమశిక్షణ, నాయకత్వం, దేశ సేవ పట్ల నిబద్ధతకు నిదర్శనంగా, ఈ కార్యక్రమంలో ఎన్.సి.సి. క్యాడెట్ల ర్యాంక్ ప్రదానోత్సవం కూడా జరిగింది.స్టూడెంట్ లైఫ్ బృందం నిర్వహించిన ఈ వేడుకలు అల్పాహారంతో ముగిశాయి. ఈ కార్యక్రమం స్వేచ్ఛ, ఐక్యత, దేశభక్తి, బలమైన భారతదేశ నిర్మాణానికి సామూహిక బాధ్యత వంటి విలువలతో పాల్గొన్నవారిని ఉత్తేజపరిచింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *