గీతం ఆతిథ్య ఉపన్యాసంలో స్పష్టీకరించిన
ఐఐటీ ఖరగ్ పూర్ ప్రొఫెసర్ పీవీఎస్ఎన్ మూర్తి
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
ఎంచుకున్న రంగంలోని మౌళిక అంశాలపై లోతైన అవగాహన ఏర్పరచుకుంటే, దానిపై సూక్ష్మ స్థాయిలో పరిశోధన చేపట్టి, మంచి ఫలితాలు రాబట్టవచ్చని ఐఐటీ ఖరగ్ పూర్ ప్రొఫెసర్ పీవీఎస్ఎన్ మూర్తి అన్నారు. గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ లో శుక్రవారం ‘సూక్ష్మ నాళాలలో న్యూటోనియన్ కాని ద్రవ ప్రవాహంలో నిర్దేశిత ఔషధ లక్ష్యం – పీడన పల్పేషన్ ప్రభావం’ అనే అంశంపై ఆయన ఆతిథ్య ఉపన్యాసం చేశారు. అమ్మ కడుపులోని శిశువు ముందుగా శ్వాస తీసుకుంటుందని, ఆ తరువాత ఊపిరితిత్తులు, శ్వాస, అలా ఒక్కో అవయవం ప్రాణం పోసుకుని తమ విధిని తుది శ్వాస వరకు నిర్వస్తుంటాయని చెప్పారు. శ్వాస ఆగిపోయాక కూడా కొంతసేపు గుండె పనిచేసినా, తుది శ్వాస తరువాత ఆ ప్రాణిలో జీవం ఉండదన్నారు. ఓ అంశంపై ఇంత సూక్ష్మమైన వివేచన, అవగాహన ఏర్పరచుకోగలిగితే, ఆ తరువాత వివిధ అంశాలపై మనం చేపట్టే పరిశోధన మంచి ఫలితాలను ఇస్తుందని చెప్పారు.
ప్రొఫెసర్ మూర్తి తన ఆకర్షణీయమైన ప్రెజెంటేషన్ లో, రక్తనాళాలలో ద్రావణ వ్యాప్తి యొక్క సంక్లిష్టత, ముఖ్యంగా అయస్కాంత ఔషధ లక్ష్యం, దాని అనువర్తనాలపై దృష్టి పెట్టారు. ఎల్లిస్ మోడల్ తో సహా వివిధ నాన్-న్యూటోనియన్ ద్రవ నమూనాలపై ఆయన విశదీకరించారు. ద్రావణ వ్యాప్తి, మోడలింగ్ లో హై-ఆర్డర్ ప్రాముఖ్యతను వివరించారు.ద్రవాలని పీల్చుకోవడం, హెచ్చు తగ్గుల పీడనం, శరీర త్వరణం వంటి అంశాలు ద్రావణ వ్యాప్తి నమూనాలను గణనీయంగా ఎలా ప్రభావితం చేస్తాయో, లక్ష్య ఔషధ పంపిణీ వ్యవస్థలకు ఆచరణాత్మక చిక్కులతో సహా ప్రొఫెసర్ మూర్తి తన పరిశోధనాంశాలను వివరించారు.
ముఖ్యంగా, షీర్ ఒత్తిడి పరామితి అనంతం వైపు మొగ్గు చూపుతున్నందున, ఎల్లిస్ ద్రవ ప్రవర్తన న్యూటోనియన్ ద్రవాలతో కలుస్తుందని పరిశోధనాత్మకంగా నిరూపించారు.తొలుత, స్కూల్ ఆఫ్ సైన్స్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎం. రెజా అతిథిని స్వాగతించి, సదస్యులకు పరిచయం చేసి, సత్కరించారు. పలువురు అధ్యాపకులు అడిగిన పలు ప్రశ్నలకు ప్రొఫెసర్ మూర్తి వివరణాత్మక జవాబులిచ్చి, వారిని సమాధాన పరిచారు.