అమీన్పూర్:
బీరంగూడ- కిష్టారెడ్డిపేట రహదారి విస్తరణలో భాగంగా శ్రీ కృష్ణుడి గుడి వద్ద నిర్మిస్తున్న బ్రిడ్జి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని పటాన్చెర శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, రామచంద్రపురం కార్పొరేటర్ పుష్ప నగేష్, ఆయా శాఖల అధికారులతో కలిసి బ్రిడ్జి పనుల పురోగతిని పరిశీలించారు. బ్రిడ్జి నిర్మాణ సమయంలో మురుగు నీరంతా ఇళ్లలోకి వస్తుందన్న కాలనీవాసుల ఫిర్యాదు మేరకు స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి కాలనీ లో పర్యటించారు.
మురికినీరు కాలనీ లోకి వెళ్లకుండా అత్యవసరంగా నూతన పైప్లైన్ వేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ త్వరితగతిన పనులు పూర్తి చేసి ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చేయాలని సూచించారు. జాతీయ రహదారి కి అమీన్పూర్ మున్సిపాలిటీ కలిపి కీలకమైన బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం లభిస్తుందన్నారు.
ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి డిప్యూటీ కమిషనర్ బాలయ్య, హెచ్ఎండిఎ ఈ ఈ అప్పారావు, మున్సిపాలిటీ వైస్ చైర్మన్ నరసింహ గౌడ్, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు