– స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో గీతం ప్రోవీసీ ఉద్ఘాటన
పటాన్చెరు,మనవార్తలు ప్రతినిధి :
మనదేశం క్రమాభివృద్ధి సాధిస్తూ త్వరలోనే ప్రపంచంలోనే మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగాఆవిర్భవించనుందని గీతం హెదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు ఉద్ఘాటించారు. 77వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని గీతం ప్రాంగణంలోని గాంధీ విగ్రహం వద్ద మంగళవారం ఆయన మువ్వన్నెల జెండాను ఎగురవేసి, వందనం చేశారు. ఎన్ఎస్సీ, ఎన్ఎస్ఎస్ విద్యార్థులతో పాటు భద్రతా సిబ్బంది కవాతు తరువాత ఆయన గీతం అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు.1990 ఆర్థిక సంస్కరణల అనంతరం మనదేశం ఓ మలుపు తీసుకుందని, ఆత్మవిశ్వాసంతో, స్వతంత్రంగా వ్యవహరిస్తోందన్నారు. ప్రస్తుతం ప్రపంచంలోనే ఐదో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న మనం మూడో స్థానానికి త్వరలోనే చేరబోతున్నట్టు సభికుల హర్షధ్వానాల మధ్య ఆయన ప్రకటించారు.
వచ్చే 25 నుంచి 30 ఏళ్లలో మనం స్వయంగా రూపకల్పన చేసిన వస్తువులను ఉత్పత్తి చేయాల్సిన అవసరం ఉందని, అందులో విద్యా సంస్థల పాత్ర ఉందని, జ్ఞానాన్ని, మేథో సంపత్తిని వృద్ధిచేయడంలో అవి కీలకపాత్ర పోషిస్తాయని ఆయన చెప్పారు. ప్రపంచం మెచ్చే మేటి వస్తువులను ఉత్పత్తి చేయడం ద్వారా అది సాధించగలమన్నారు. ఒక దేశంగా భారత్ ఇతర ప్రపంచానికి అందించగల సాంకేతిక/యాజమాన్య పరిజ్ఞానాలలో అగ్రగామిగా నిలుస్తుందన్న ఆశాభావాన్ని ప్రొఫెసర్ డీఎస్ వు వెలిబుచ్చారు.చివరిగా, కళాకృతి బృందం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ వేడుకలు అల్పాహార విందుతో ముగిశాయి.