సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం
ప్రజల భాగస్వామ్యంతో ప్రభుత్వానికి దిమ్మతిరిగేలా నిరసనలు
పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు:
ప్రజలకు అరచేతిలో స్వర్గం చూపించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ఘోరంగా వైఫల్యం చెందిందని ఈ అంశంపై ప్రజలకు అవగాహన కల్పించడం కోసం బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు సెప్టెంబర్ 2 నుండి 7వ తేదీ వరకు పటాన్చెరు నియోజకవర్గంలో వివిధ అంశాలపై నిరసన కార్యక్రమం తో పాటు బాకీ కార్డు ఉద్యమాన్ని నిర్వహిస్తున్నట్లు పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.మంగళవారం సాయంత్రం పటాన్చెరు పట్టణంలోని క్యాంపు కార్యాలయం ఆవరణలో బిఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలతో ఎమ్మెల్యే జిఎంఆర్ సమావేశమై నిరసన కార్యక్రమాల వివరాలను వెల్లడించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఆరు గ్యారంటీలతోపాటు 420 హామీలు ఇచ్చి భరోసాకార్డుతో మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిందని, 1000 రోజుల కాంగ్రెస్ పాలనలో హామీల్లో ఒక్కటి కూడా అమలు చేయక పోవడంతో వారిచ్చిన హామీ మేరకు ప్రజలకు ప్రభుత్వం బాకీ పడి, అప్పుల ప్రభుత్వంగా మారిందని, రేవంత్ సర్కార్ సిబిల్ స్కోర్ పడిపోయిందని విమర్శించారు. ప్రజలకు ఇవ్వాల్సిన బాకీలను ఎప్పటి వరకు ఇస్తారో సీఎం రేవంత్రెడ్డి గడువు చెప్పాలని సూటిగా ప్రశ్నించారు. నియోజకవర్గ పరిధిలోని బిఆర్ఎస్ పార్టీ అన్ని స్థాయిల ప్రజా ప్రతినిధులు, నాయకులు, యువత, మహిళలు, కార్మికులు, కర్షకులు, రైతులు భారీ సంఖ్యలో హాజరై కార్యక్రమాలను దిగ్విజయవంతం చేయాలని ఎమ్మెల్యే జిఎంఆర్ పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ పార్టీ కో ఆర్డినేటర్ ఆదర్శ్ రెడ్డి, ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
