మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు:
అన్నాచెల్లెళ్ల ప్రేమానురాగాలు, ఆప్యాయత, నమ్మకం, బాధ్యతలకు రక్షాబంధన్ పండుగ ప్రతీకగా నిలుస్తుందని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి నీలం మధు ముదిరాజ్ అన్నారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా చిట్కుల్లోని ఆయన నివాసంలో పలువురు మహిళలు నీలం మధుకు రాఖీలు కట్టి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా ఆయన వారికి మిఠాయిలు తినిపించి, ఆప్యాయంగా పలకరిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం నీలం మధు మాట్లాడుతూ రక్షాబంధన్ అనేది కేవలం దారం కట్టే సంప్రదాయం మాత్రమే కాదని, పరస్పర విశ్వాసం, రక్షణకు ఇచ్చే మాట అని పేర్కొన్నారు. సమాజంలో ప్రతి మహిళ గౌరవంగా, భద్రంగా జీవించే వాతావరణాన్ని కల్పించినప్పుడే నిజమైన ప్రగతి సాధ్యమవుతుందన్నారు. మహిళల అభ్యున్నతికి, సాధికారతకు కాంగ్రెస్ పార్టీ నిరంతరం కట్టుబడి ఉంటుందని, వారి సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ ముందుంటామని హామీ ఇచ్చారు. సోదరభావం, సామాజిక ఐక్యతను పెంపొందించే ఇలాంటి పండుగలు సమాజాన్ని మరింత చైతన్యవంతం చేస్తాయని చెప్పారు.
