మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు:
సిగాచి ఇండస్ట్రీస్ ప్రమాదం జరిగి 13 నెలలు గడిచినా, పలువురు బాధిత కుటుంబాలకు ఇంకా ఈపీఎఫ్ , ఈఎస్ఐ ప్రయోజనాలు అందలేదని తెలంగాణ పీపుల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ సంగారెడ్డి జిల్లా కమిటీ పేర్కొంది.ఈ నేపథ్యంలో టి పి జే ఏ సి జిల్లా ప్రతినిధులు పటాన్చెరు ఈఎస్ఐసి కార్యాలయాలను సందర్శించి, సంబంధిత అధికారులను కలిసి వినతిపత్రాలు సమర్పించారు. ఈపీఎఫ్, ఈడి ఎల్ ఐ ప్రయోజనాలు పెండింగ్లో ఉన్న 13 మంది బాధితుల జాబితాను ఈపీఎఫ్ ఓ అధికారులకు, ఈఎస్ఐ ప్రయోజనాలు పెండింగ్లో ఉన్న 25 మంది బాధితుల జాబితాను ఈఎస్ఐసి అధికారులకు అందజేశారు.ఈ సందర్భంగా టి పి జే ఏ సి సంగారెడ్డి జిల్లా కన్వీనర్ వై. అశోక్ కుమార్ మాట్లాడుతూ సిగాచి ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రాజేష్ కుమార్ చౌదరి విషయంలో కంపెనీ పూర్తి బాధ్యత వహించి, ఆయనకు మెరుగైన వైద్య చికిత్సను అందించడంతో పాటు, నష్టపరిహారంగా రూ.50 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేశారు.ప్రమాద బాధిత కుటుంబాలు ఇప్పటికే తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నందున, పెండింగ్లో ఉన్న ఈపీఎఫ్, ఈడి ఎల్ ఐ , ఈఎస్ఐ క్లెయిమ్లను అత్యవసరంగా పరిష్కరించి, అర్హులైన బాధితులకు చట్టబద్ధంగా అందాల్సిన అన్ని ప్రయోజనాలను తక్షణమే అందించాలని టి పి జే ఏ సి కోరింది.ఈ కార్యక్రమంలో శ్రీధర్ మహేంద్ర – కో-ఆర్డినేటర్, ఆర్. లక్ష్మి – కో-కన్వీనర్ ,ఏ. మానస – కో-కన్వీనర్ పాల్గొన్నారు.
