దేశ ప్రతిష్టను విశ్వవ్యాప్తం చేసిన మహనీయుడాయన
ఆయన స్ఫూర్తితో యువత ముందుకు సాగాలి
నీలం మధు ముదిరాజ్
చిట్కుల్ లో ఘనంగా వివేకానంద జయంతి వేడుకలు..
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు:
దేశ జాతిని జాగృతం చేస్తూ, నేటి యువతే దేశ భవిష్యత్తుకు పునాది అని యువతలో స్ఫూర్తి నింపుతూ మన దేశ ప్రతిష్టను విశ్వవ్యాప్తంగా ఇనుమడించేలా చేసిన విశ్వగురువు స్వామి వివేకానంద అని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ నీలం మధు ముదిరాజ్ అన్నారు.స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని సోమవారం ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలో చిట్కుల్ ఎన్.ఎం.ఆర్ క్యాంపు కార్యాలయంలో వివేకానంద చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా నీలం మధు మాట్లాడుతూ రామకృష్ణ పరమహంసకు ప్రియ శిష్యుడైన వివేకానంద దేశంలో హిందూ మతం పునరుజ్జీవనంలో ప్రధాన పాత్ర పోషించారని తెలిపారు. పాశ్చాత్య ప్రపంచానికి భారతీయ వేదాంతం, ఆధ్యాత్మికత, యోగా, తత్వాలను పరిచయం చేయడంలో కీలకపాత్ర పోషించి మన దేశ గొప్పతనాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పారని కొనియాడారు.భారతదేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందన్న విశ్వాసాన్ని బలంగా నమ్మి ఆత్మవిశ్వాసం, ధైర్యం, కార్యదక్షత కలిగిన పౌరులుగా తయారు చేశారన్నారు. నేటి పోటీ ప్రపంచంలో చదువుతో పాటు వ్యక్తిత్వ వికాసం ఎంత ముఖ్యమో ఆయన ఆనాడే గుర్తించి యువతకి బోధనలు చేశారని అన్నారు, ఆ మహనీయుడి జన్మదినాన్ని దేశ యువజన దినోత్సవంగా జరుపుకుంటున్నామని, ఆయన స్ఫూర్తితో యువత ఒక లక్ష్యాన్ని ఎంచుకుని, క్రమశిక్షణతో, నిబద్ధతతో ముందుకు సాగితే విజయం తథ్యమని అభివర్ణించారు.
ఆ మహనీయుడు అందించిన సందేశం నుంచి యువత స్ఫూర్తి పొంది తమ భవిష్యత్తు ని బంగారుమయం చేసుకొవడంతో పాటు దేశ అభివృద్ధికి చేయూతనందించాలని పిలుపునిచ్చారు, ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ శ్రేణులు,స్థానిక నాయకులు,తదితరులు పాల్గొన్నారు..
