మనవార్తలు ప్రతినిధి – పటాన్ చెరు:
హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ కు చెందిన గణిత, గణాంక శాస్త్ర విభాగం ‘ఆధునిక ఏఐ అన్వేషణ: సహజ భాషా ప్రాసెసింగ్ నుంచి అభిజ్జా మేధస్సు వరకు’ పేరిట నిర్వహిస్తున్న రెండు రోజుల ఆచరణాత్మక కార్యశాలను మంగళవారం ఉదయం లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హైదరాబాదు విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ శిబా ఉద్గాట ముఖ్య అతిథిగా, కెపీఎమ్ జీ గ్లోబల్ డెలివరీ సెంటర్, హైదరాబాదుకు చెందిన డాక్టర్ కె. సంపత్ కుమార్ ఆత్మీయ అతిథిగా పాల్గొన్నారు.ముఖ్య అతిథి మాట్లాడుతూ, మానవ మెదడు యొక్క అద్భుతమైన సామర్థ్యాలను, దక్షతను వివరిస్తూ, మానవ మేధస్సు అనేక అంశాలలో కృత్రిమ మేధస్సును అధిగమిస్తూనే ఉందని నొక్కి చెప్పారు. విద్యార్థులంతా ఆత్మవిశ్వాసంతో ఉండాలని, నిరంతరం నేర్చుకోవాలని, ఏఐని సామాజిక ప్రయోజనానికి ఒక సాధనంగా బాధ్యతాయుతంగా ఉపయోగించాలని ప్రొఫెసర్ ఉద్గాట ప్రోత్సహించారు.ఏఐ యొక్క వేగవంతమైన పరిణామం గురించి గౌరవ అతిథి ప్రసంగిస్తూ, ‘అటెన్షన్ ఈజ్ ఆల్ యు నీడ్’ వంటి ప్రాథమిక పరిశోధనల నుంచి చాట్ జీపీటీ వంటి ఆధునిక అప్లికేషన్ల వరకు దాని పురోగతులను వివరించారు.

వివిధ పరిశ్రమలలో ఏఐ తీసుకొస్తున్న పరివర్తనాత్మక ప్రభావాన్ని, ఏఐని వినియోగించుకోవడంలో పెరుగుతున్న డెవలపర్ల పాత్రను వివరించారు. సైబల్ సెక్యూరిటీతో సహా కొత్తగా ఎదురయ్యే సవాళ్లకు సిద్ధంగా ఉండాల్సిన ప్రాముఖ్యతను డాక్టర్ సంపత్ కుమార్ వివరించారు. ఈ కార్యశాలలో డాక్టర్ పి.కృష్ణమూర్తి (ఐఐఐటీ హైదరాబాదు), ప్రొఫెసర్ రమేష్ కుమార్ మిశ్రా (హైదరాబాదు విశ్వవిద్యాలయం), ప్రొఫెసర్ అనిమేష్ ముఖర్జీ (ఐఐటీ ఖరగ్ పూర్) వంటి ప్రముఖ నిపుణులు పాల్గొంటున్నారు.కృత్రిమ మేధస్సు, సహజ భాషా ప్రాసెసింగ్, కాగ్నిటివ్ సైన్స్ లలోని ఇటీవలి పురోగతులను, వాటి గణిత, గణన పునాదులపై అవగాహన కల్పించడమే లక్షంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో ప్రముఖ సంస్థలకు చెందిన విద్యావేత్తలు, పరిశోధకులు నైపుణ్యోపన్యాసాలు చేయడంతో పాటు ఆచరణాత్మక శిక్షణ కూడా ఇస్తున్నారు.
ఇందులో పాల్గొంటున్న వారు, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్, ఏజెంటిక్ ఏఐ, బహుభాషా ఎన్ఎల్ పీ, కాగ్నిటివ్-ప్రేరిత వ్యవస్థలతో సహా అభివృద్ధి చెందుతున్న ఏఐ సాంకేతికతలపై ఆచరణాత్మక అనుభవాన్ని పొందడంతో పాటు వివిధ పరిశ్రమలలో వాటి వినియోగంపై అవగాహనను కూడా ఏర్పరచుకుంటున్నారు.తొలుత, స్కూల్ ఆఫ్ సైన్స్ ప్రిన్సిపాల్ డాక్టర్ మోతహర్ రెజా అతిథులను స్వాగతించి, సత్కరించారు. విభాగాధిపతి డాక్టర్ జాదవ్ గణేష్ మార్గదర్శనంలో, డాక్టర్ కె.కృష్ణ, డాక్టర్ కె.భీమశంకర్ సహకారంతో డాక్టర్ డి. మల్లికార్జునరెడ్డి ఈ కార్యశాలను సమన్వయం చేస్తున్నారు. విద్యార్థి సమన్వయకర్తలు సహస్ర, దీప, సుష్మిక, స్నేహలు వారికి సహకరిస్తున్నారు. ఎం.ఎస్సీ. డేటా సైన్స్, బీ.ఎస్సీ. సీఎస్ సీఎస్, బీ.ఎస్సీ. స్టాటిస్టిక్స్ కోర్సులను అభ్యసిస్తున్న విద్యార్థులతో పాటు పలువురు అధ్యాపకులు, పరిశ్రమ నిపుణులు తదితరులు ఈ కార్యశాలలో పాల్గొంటున్నారు.
