చిన్నారులకు అక్షరాభ్యాసం – విద్యాభివృద్ధికి శుభారంభం
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు:
విద్యకు అధిదేవత అయిన సరస్వతి దేవి కృపతో జ్ఞానవికాసం కలగాలని ఆకాంక్షిస్తూ వసంత పంచమి పర్వదినాన్ని పురస్కరించుకొని పటాన్చెరు ముత్తంగి శ్రీ సాయి చైతన్య హై స్కూల్లో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పాఠశాల కరస్పాండెంట్ శ్రీ బి. ప్రభాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై సరస్వతి దేవిని ప్రత్యేక పూజలతో ప్రార్థించారు. అనంతరం చిన్నారులతో అక్షరాభ్యాసం చేయించిచారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వసంత పంచమి జ్ఞానానికి, సంస్కృతికి ప్రతీక అని, విద్యాభ్యాసం చిన్న వయస్సులోనే ప్రారంభమైతే పిల్లలు అన్ని రంగాల్లో రాణిస్తారని తెలిపారు.పాఠశాల ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు కార్యక్రమాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించి విద్యార్థుల్లో విద్యపై ఆసక్తిని పెంపొందించేలా ప్రత్యేక శ్రద్ధ వహించారు. అక్షరాభ్యాసం చేసిన చిన్నారుల తల్లిదండ్రులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని తమ పిల్లలకు ఇలాంటి శుభదినంలో విద్యాభ్యాసం ప్రారంభించడం ఆనందంగా ఉందని తల్లిదండ్రులు పేర్కొన్నారు.విద్య యొక్క ప్రాముఖ్యతను, భారతీయ సంప్రదాయాల విలువలను విద్యార్థులకు తెలియజేయడం జరిగిందని పాఠశాల యాజమాన్యం తెలిపింది. భవిష్యత్తులో కూడా విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ఇలాంటి కార్యక్రమాలను నిర్వహిస్తామని పాఠశాల కరస్పాండెంట్ శ్రీ బి. ప్రభాకర్ రెడ్డి తెలిపారు .

